చిరంజీవి ఆ స్థానం నుంచి పోటీ చేస్తే సీఎం కావడం ఖాయం : ఏపీ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత చింతా మోహ‌న్ అన్నారు.

By Medi Samrat  Published on  13 Jan 2024 8:58 AM GMT
చిరంజీవి ఆ స్థానం నుంచి పోటీ చేస్తే సీఎం కావడం ఖాయం : ఏపీ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత చింతా మోహ‌న్ అన్నారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. 130 అసెంబ్లీ, 20 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ గెలవబోతుందని జోష్యం చెప్పారు. ఏపీలో ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ ఉండదని అన్నారు. గత 10 ఏళ్లలో రాష్ట్ర ప్రజలు ఆదరణకు నోచుకోలేదని.. తీవ్రఅసంతృప్తిగా ఉన్నారని వ్యాఖ్యానించారు.

రాష్ట్రానికి సీఎం కావాలని కోరుకుంటున్న కాపులకు ఇదే మంచి అవకాశమ‌న్నారు. చిరంజీవి తిరుపతి అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తే 50 వేల మెజార్టీతో గెలిపిస్తామ‌న్నారు. చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేస్తే సీఎం కావడం ఖాయం అన్నారు. పోటీకి దిగాలా.? వొద్దా.? అన్న నిర్ణయం తీసుకోవాల్సింది చిరంజీవేన‌న్నారు.

రాష్ట్రంలో ఇండియా కూటమిలో ఉన్న పార్టీలతో కలిసి పోటీ చేస్తామ‌ని తెలిపారు. కాకినాడ లోక్ సభ నుంచి సీపీఎం పార్టీ జాతీయ నాయకుడు సీతారాం ఏచూరిని పోటీ చేయాలని కోరారు. నగరి అసెంబ్లీ నుంచి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణను పోటీ చేయమని కోరారు. కాంగ్రెస్ పార్టీకి స్పందన వస్తోందని.. కాంగ్రెస్ రావాలని.. కావాలని.. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ముక్తకంఠంతో కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

Next Story