నాటుసారా ఘటనపై మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

Complaint to Human Rights Commission on Jangareddygudem incident. జంగారెడ్డిగూడెం నాటుసారా ఘటనపై మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని

By Medi Samrat  Published on  17 March 2022 10:32 AM GMT
నాటుసారా ఘటనపై మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

జంగారెడ్డిగూడెం నాటుసారా ఘటనపై మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ తెలిపారు. గురువారం ఆయన విజయవాడ ఆంధ్ర రత్న భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. 30 మంది మృతికి గల కారణాలు బయటకురావాలన్నారు. ఇప్పటి వరకు ఎక్సైజ్ మంత్రి జంగారెడ్డి గూడెం సందర్శించలేదని విమర్శించారు. ఈ ఘటనపై హైకోర్టులో కూడా పిల్ దాఖలు చేస్తామన్నారు. సీఎం జగన్ ప్యాలెస్‌లో కూర్చుంటే పాలన సాగదన్నారు. నాటుసారా తాగి అనేకమంది చనిపోతున్నారని, అధికార యంత్రాంగం ఒత్తిళ్లకు భయపడి సహజ మరణలుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. జ్యూడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

వైసీపీ ప్రభుత్వ పరిపాలన వైఫల్యం చెందిందని.. బాధితులకు రూ. 50 లక్షల నష్టపరిహారం తక్షణమే అందించాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. నాటుసారా తాగి మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ తమవంతు సాయం అందించినట్లు చెప్పారు.

చురుకుగా కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం :

కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్రంలో డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుకుగా సాగుతోందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ వెల్లడించారు. డిజిటల్ సభ్యత్వ నమోదులో సాంకేతికంగా వచ్చిన ఇబ్బందులను పరిష్కరించేందుకు ఆంధ్ర రత్న భవన్ లో ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీ ప్రగతి పధంలో పయనించేలా ఈ 12 రోజులు కష్టపడి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు.















Next Story