గృహనిర్మాణశాఖపై సీఎం జగన్‌ సమీక్ష

CM Jagan's review of housing department. గృహనిర్మాణశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.

By Medi Samrat  Published on  2 Jan 2023 11:01 AM GMT
గృహనిర్మాణశాఖపై సీఎం జగన్‌ సమీక్ష

గృహనిర్మాణశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో రాష్ట్రవ్యాప్తంగా హౌసింగ్‌ ప్రగతిని సీఎంకు అధికారులు వివరించారు. ఇళ్ల నిర్మాణం వేగంగా సాగుతోందని అధికారులు సీఎంకు తెలిపారు. టిడ్కో కాకుండా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇళ్ల నిర్మాణంకోసం రూ. 6,435 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చుచేసిందని.. అధికారులు క్రమం తప్పకుండా ఆయా లే అవుట్లకు వెళ్లి ఇళ్ల నిర్మాణ ప్రగతిని పరిశీలిస్తున్నారని వెల్లడించారు. డిసెంబర్‌ నెలలో 4 సార్లు లే అవుట్లను పరిశీలించామన్న అధికారులు.. ఇళ్ల నిర్మాణ నాణ్యతపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. మొత్తం నాలుగు రకాల పరీక్షలు నిర్వహించనున్నట్టు అధికారుల వెల్లడించారు. అన్ని లే అవుట్లలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన ల్యాబులు కూడా ఏర్పాటు చేసుకుంటున్నట్టు వెల్లడించారు.

ఈ సందర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. ఇళ్లు పూర్తయ్యే నాటికి కరెంటు, నీళ్లు, డ్రైనేజీ ఈ మూడు సౌకర్యాలు కచ్చితంగా కల్పించాలని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. అలాగే ఇళ్ల లబ్ధిదారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి నిర్ణీత దశకు రాగానే వాటికి కరెంటు కనెక్షన్లు ఇవ్వాలని సూచించారు. వివిధ కోర్టు వివాదాల వల్ల ఇళ్ల నిర్మాణం నిలిచిపోయిన చోట్ల ప్రత్యామ్నాయాలను వెంటనే చూడాలని సీఎం ఆదేశించారు. కోర్టు కేసులు పరిష్కారం కాని చోట వెంటనే ప్రత్యామ్నాయ స్థలాలు చూసి ఇళ్లనిర్మాణాలు ప్రారంభించాలని చెప్పారు.

ఈ సమీక్షా సమావేశంలో గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఏపీ హౌసింగ్‌ కార్పోరేషన్‌ ఛైర్మన్‌ దవులూరి దొరబాబు, టిడ్కో ఛైర్మన్‌ జమ్మాన ప్రసన్నకుమార్, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌రెడ్డి, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ స్పెషల్‌ సీఎస్‌ జి సాయి ప్రసాద్, ఇంధనశాఖ స్పెషల్‌ సీఎస్‌ కె విజయానంద్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్‌ శ్రీధర్, సీసీఎల్‌ఏ కార్యదర్శి ఇంతియాజ్, ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ జి లక్ష్మీ షా, గృహనిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శి మహమ్మద్‌ దీవాన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Next Story