అమిత్ షాతో ముగిసిన సీఎం జగన్ భేటీ
CM Jagan's meeting with Amit Shah ends. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
By Medi Samrat
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. సుమారు 45 నిమిషాల పాటు ఈ భేటీ సాగింది. విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయమై కేంద్ర మంత్రితో జగన్ అమిత్ షాతో చర్చించారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. మోదీతో సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో జగన్ భేటీ అవుతారు. గురువారం ఉదయం మరికొందరు కేంద్ర మంత్రులతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. బుధవారం ఉదయం సీఎం జగన్ అమరావతి నుండి న్యూఢిల్లీకి బయలుదేరారు. మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు జగన్ న్యూఢిల్లీకి చేరుకున్నారు. న్యూఢిల్లీకి చేరుకున్న వెంటనే ఆయన అమిత్ షాతో పలు విషయాల గురించి చర్చించారు. యూనిఫాం సివిల్ కోడ్ బిల్లుపై కూడా చర్చ జరిగిందని అంటున్నారు.
రాష్ట్రం రుణాలపై కేంద్రం ఆంక్షలు విధించడం సరికాదని ఆర్థిక మంత్రికి సీఎం వివరించనున్నారు. నిబంధనల ప్రకారం ఇచ్చిన రుణ పరిమితిని కూడా తగ్గించారని.. 2021-22లో రూ.42,472 కోట్ల రుణపరిమితి కల్పించి, తదుపరి కాలంలో రూ.17,923 కోట్లకు కుదించిన విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్ళనున్నారు. ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరనున్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఖర్చు చేసిన రూ.2600.74 కోట్లను సత్వరమే చెల్లింపులు చేయాలని కోరనున్నారు.