తుపాను, భారీ వర్షాలపై సీఎం జగన్‌ సమీక్ష

CM Jagan Review Meeting On Cyclone. జిల్లాల కలెక్టర్లతో వర్షాలపై సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు.

By Medi Samrat  Published on  12 Dec 2022 10:42 AM GMT
తుపాను, భారీ వర్షాలపై సీఎం జగన్‌ సమీక్ష

జిల్లాల కలెక్టర్లతో వర్షాలపై సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. కలెక్టర్లు, అధికారులు అత్యంత మానవతా దృక్పథంతో వ్యవహరించాలని చెప్పారు. ఎన్యుమరేషన్‌ విషయంలో ఉదారంగా వ్యవహరించండని ఆదేశించారు. ఎక్కడా రైతులు నిరాశకు గురికాకూడదని.. రంగుమారిన ధాన్యమైనా, తడిసిన ధాన్యమైనా కొనుగోలు చేయలేదన్న మాట ఎక్కడా రాకూడదని అన్నారు. తక్కువ రేటుకు కొంటున్నారన్న మాట ఎక్కడా వినిపించకూడదని.. ఒకవేళ రైతులు తాము బయట అమ్ముకుంటున్నామన్నా సరే, వారికి రావాల్సిన రేటు వారికి రావాలని.. ఆ రేటు వచ్చేలా చూడాల్సిన బాధ్యత కూడా అధికారులదేన‌ని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

తుపాను, దాని ప్రభావం వల్ల వర్షాలు కురిసిన జిల్లాల్లో కలెక్టర్లు అందరూ దీనికోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంటలు దెబ్బతిన్నచోట మళ్లీ పంటలు వేసుకోవడానికి 80శాతం సబ్సిడీతో విత్తనాలు అందించాలని.. పంటలు దెబ్బతిన్న ప్రతి రైతుకు అందించాలని కోరారు. ఎక్కడైనా ఇళ్లు ముంపునకు గురైతే.. ఆ కుటుంబానికి రూ.2వేల రూపాయలతోపాటు, రేషన్‌ అందించాలని కోరారు. ఇంట్లోకి నీళ్లు వచ్చినా సరే.. ప్రభుత్వం పట్టించుకోలేదనే మాట రాకూడదని.. నీళ్లు ఇంటిలోకి వచ్చి ఉంటే.. కచ్చితంగా వారికి సహాయాన్ని అందించాల్సిందేన‌ని.. ఈ విషయాన్ని కలెక్టర్లు అంతా దృష్టిలో ఉంచుకోవాలని ఆదేశించారు.

పట్టణాలు, పల్లెలతో సంబంధం లేకుండా ఈ సహాయాన్ని బాధితులందరికీ అందించాలని అన్నారు. గోడకూలి ఒకరు మరణించారన్న ఘటన జరిగినట్టుగా సమాచారం వచ్చింది. వారికి కూడా పరిహారం వెంటనే అందించాలి. వారంరోజుల్లో ఈ సహాయం అంతా వారికి అందాలి. ఎక్కడైనా పశువులకు నష్టం జరిగినా సరే ఆ పరిహారం కూడా సత్వరమే అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నష్టపరిహారం అంచనాల నమోదును వెంటనే ప్రారంభించాలని.. వచ్చే వారంరోజుల్లో ఈ ప్రక్రియ ముగించాలని సీఎం జగన్‌ అధికారులకు స్పష్టం చేశారు.


Next Story