చంద్రబాబు కుప్పం నుంచి తనకు కావాల్సింది తీసుకున్నాడే తప్ప చేసిందేమీ లేదు: సీఎం జగన్

CM Jagan Comments On Chandrabau. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు

By Medi Samrat  Published on  23 Sep 2022 12:59 PM GMT
చంద్రబాబు కుప్పం నుంచి తనకు కావాల్సింది తీసుకున్నాడే తప్ప చేసిందేమీ లేదు: సీఎం జగన్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా చేయూత పథకం నిధులను విడుదల చేశారు. చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. కుప్పంకు చంద్రబాబు ఎమ్మెల్యేనే అయినా నాన్ లోకల్ గా మారిపోయారని, హైదరాబాద్ కు లోకల్ అయ్యారని ఎద్దేవా చేశారు. కుప్పం నుంచి తనకు కావాల్సినంత రాబట్టుకున్నాడని, ప్రజలకు మాత్రం ఏమీ చేయలేదని వ్యాఖ్యానించారు. దొంగ ఓట్లు వేయించుకోవడంలో బాబుకు ఉన్న అనుభవం గురించి ఈ జిల్లాలో కథలు కథలుగా చెప్పుకుంటుంటారని తెలిపారు. గత 30 ఏళ్లుగా వెన్నుపోటుకు, దొంగ ఓటుకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది ఎవరూ అంటే, అది చంద్రబాబేనని అన్నారు. కుప్పం నుంచి నిత్యం 5 వేల మంది ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారని... కుప్పం నుంచి పలమనేరు హైవేకి లింక్ ఇస్తానని చెప్పి, వదిలేశాడని, కుప్పం మున్సిపాలిటీ పరిధిలో డబుల్ రోడ్డు వేయలేదని ఆరోపించారు. ఎన్నిసార్లు గెలిచినా కుప్పంలో రోడ్డు వేసే మనసు లేదు కానీ, కుప్పంలో ఎయిర్ పోర్టు నిర్మిస్తానని ప్రజల చెవిలో పూలు పెట్టాడని అన్నారు. చివరికి రెవెన్యూ డివిజన్ కూడా ఏర్పాటు చేయలేకపోయాడని విమర్శించారు. ప్రజల నుంచి ఒత్తిడి వచ్చేసరికి నాకు లేఖ రాశాడు... చంద్రబాబు కంటే చేతకాని నాయకుడు ఉంటాడా? అని ప్రశ్నించారు. కుప్పం బీసీల సీటు అని, ఇక్కడ అత్యధికంగా ఉన్నది బీసీలేనని సీఎం జగన్ వెల్లడించారు. అలాంటప్పుడు బీసీలకు ఈ సీటును ఇవ్వకుండా లాక్కున్న పెద్దమనిషి సామాజిక న్యాయం గురించి మాట్లాడడం హాస్యాస్పదం అని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు నాయుడు చేసే మోసాలు భరించేది లేదని కుప్పం ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీగా ఉన్న భరత్ తనతో ఇన్ని అభివృద్ధి పనులు చేయిస్తున్నాడని, వచ్చే ఎన్నికల్లో కుప్పంలో భరత్ ను గెలిపిస్తే మంత్రిని చేస్తానని సీఎం జగన్ ప్రకటించారు. కుప్పం నియోజకవర్గాన్ని సొంత నియోజకవర్గంగా భావిస్తానని స్పష్టం చేశారు. జిల్లా పరిషత్, మండల, పంచాయతీ ఎన్నికల అన్నింటిలోనూ కుప్పం ప్రజలు తమ పక్షానే నిలిచి వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ జెండాను ఎగురవేశారని కొనియాడారు. కుప్పంలోని అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములకు ఇంకా మంచి చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నానని తెలిపారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో కరవుకు పరిష్కారం చూపలేకపోయాడని విమర్శించారు. కేంద్రంలో రాష్ట్రపతులను మార్చుతానంటాడు, ప్రధానమంత్రులను కూడా తానే నియమిస్తానని, కేంద్రంలో తానే చక్రం తిప్పానని చెప్పుకుంటాడు, కానీ కుప్పంలో పంపులు తిప్పితే నీరు వచ్చే పరిస్థితిని తీసుకురాలేకపోయాడు ఈ పెద్ద మనిషి అని అన్నారు.




Next Story