పుష్కరాల్లోగా పోలవరం ప్రాజెక్టును నిర్మించి జాతికి అంకితం చేస్తాం: చంద్రబాబు

విధ్వంసమైన వ్యవస్థల నుంచి సుపరిపాలనను గాడిలో పెట్టాం..అని సీఎం చంద్రబాబు అన్నారు.

By -  Knakam Karthik
Published on : 12 Jan 2026 1:48 PM IST

Andrapradesh, Cm Chandrababu, State Ministers, Secretaries, Polavaram, Amaravati

పుష్కరాల్లోగా పోలవరం ప్రాజెక్టును నిర్మించి జాతికి అంకితం చేస్తాం: చంద్రబాబు

అమరావతి: విధ్వంసమైన వ్యవస్థల నుంచి సుపరిపాలనను గాడిలో పెట్టాం..అని సీఎం చంద్రబాబు అన్నారు. సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా జీఎస్టీపీ, ఆర్టీజీఎస్, పట్టాదార్ పాస్ పుస్తకాలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ..2025 ఏడాది మంచి ఫలితాలను ఇచ్చింది. ప్రజల ఆశల్ని నిలబెట్టాం, వారిలో విశ్వాసాన్ని మళ్లీ కల్పించాం..అని సీఎం పేర్కొన్నారు. అప్పు తీసుకునే వెసులుబాటు కూడా లేని పరిస్థితి నుంచి సూపర్ సిక్స్ ద్వారా సంక్షేమం, అభివృద్ధిని వేగంగా చేయగలిగాం, ఈ ఏడాది కూడా మరింత కష్టించి పనిచేద్దామని పిలుపునిస్తున్నాను..అని సీఎం వ్యాఖ్యానించారు.

తల్లికి వందనం ద్వారా రూ.10,090 కోట్లను 67 లక్షల మంది విద్యార్ధుల తల్లుల ఖాతాలకు వేశాం. స్త్రీశక్తి ద్వారా 3.5 కోట్ల ప్రయాణాలు మహిళలు చేశారు. దీని కోసం ఇప్పటి వరకూ రూ.1114 కోట్లు వ్యయం చేశాం. అన్నదాత సుఖీభవ ద్వారా 46 లక్షల మంది రైతులకు రూ.6,310 కోట్లు జమ చేశాం..దీపం 2.0 ద్వారా 2 కోట్ల సిలిండర్లను ఇప్పటికి పంపిణీ చేయగలిగాం. దీనికి రూ.2684 కోట్లు వ్యయం చేశాం. ఏడాదిన్నరలో రూ.50 వేల కోట్ల మేర సామాజిక పెన్షన్లను అందించటంలో సంక్షేమంలో కొత్తమైలు రాయిని సాధించాం. 70 వరకూ పెద్ద పథకాలు, కార్యక్రమాలు, పనులు చేశాం..అని సీఎం చంద్రబాబు తెలిపారు.

అమరావతిని స్మశానం అని, ఎడారని ఎగతాళి చేశారు. కానీ ఇదో స్ఫూర్తిదాయక ప్రాజెక్టు, అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేస్తున్నాం. పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు. ప్రతీ ఏటా 3 వేల టీఎంసీల మేర నీరు వృధాగా సముద్రంలోకి వెళ్తోంది. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వటం ద్వారా శ్రీశైలంలోని నీటిని పొదుపు చేసి రాయలసీమకు ఇస్తున్నాం. నల్లమల సాగర్ ద్వారా రాయలసీమ, ప్రకాశం తదితర ప్రాంతాలకు నీరు ఇచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఎవరికీ నష్టం లేదు. ఎగువ నుంచి వదిలిన నీళ్లు పోలవరం నుంచి నల్లమల సాగర్ కు తీసుకెళ్లి వాడుకుంటే తప్పేంటి. పోలవరంలో మిగిలిన నీళ్లు తెలంగాణా రాష్ట్రం కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రాజెక్టులు కట్టినప్పుడు నేనెప్పుడు అడ్డు చెప్పలేదు. రెండు తెలుగు రాష్ట్రాలూ గోదావరి జలాలను సమర్ధంగా వినియోగించుకోవచ్చు. పుష్కరాల్లోగా పోలవరం ప్రాజెక్టును నిర్మించి జాతికి అంకితం చేస్తాం, భోగాపురం ఎయిర్ పోర్టు కూడా త్వరలోనే జాతికి అంకితం చేస్తాం..అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story