తీపికబుర్లు.. మే నుంచి తల్లికి వందనం.. ఉగాది నుంచి పీ4కు శ్రీకారం.. జూన్ నాటికి..
బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత ఇచ్చామని , రాష్ట్ర ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వ పాలన సాగుతోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు
By Medi Samrat Published on 1 March 2025 6:16 PM IST
బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత ఇచ్చామని , రాష్ట్ర ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వ పాలన సాగుతోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఏ ఒక్కరి ముఖాల్లో చిరునవ్వు లేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు. చిత్తూరు జిల్లా జి.డి. నెల్లూరులో పింఛన్ల పంపిణీలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. బీసీ కాలనీలో గీత కార్మికుడు వాసు, ఎస్సీ కాలనీలో వసంతమ్మ ఇంటికి వెళ్లి స్వయంగా పెన్షన్ అందజేశారు. అనంతరం పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. గత పాలకులు రాష్ట్రాన్ని అడవి పందుల్లా దోచుకుతిన్నారని, . రూ. 10 లక్షల కోట్ల అప్పుల భారం ప్రజలపై మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నాం. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు చిత్తశుద్ధితో ప్రతి నిమిషం పనిచేయడంతో పాటు నేతలను, అధికార యంత్రాంగాన్ని అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తున్నానని ముఖ్యమంత్రి అన్నారు. కేవలం 9 నెలల్లో రూ. 6 లక్షల 50 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చామని తద్వారా 5 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని చెప్పారు.
పింఛన్ల పంపిణీతో పేదల కళ్లలో ఆనందం
మన దేశంలో ఒక్క పెన్షన్ల కిందే ప్రతి నెలా 64 లక్షల మందికి ఏడాదికి రూ. 33 వేల కోట్లు వెచ్చిస్తోంది ఏపీ ప్రభుత్వమే. గత ప్రభుత్వంలో ముక్కుతూ మూలుగుతూ పింఛన్లు ఇచ్చారు. రూ. 200 పింఛన్ని రూ. 2 వేలు చేసింది నేనే. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు రూ. 3,000 పింఛను రూ 4000 వేలు చేశాను. డయాలసిస్ రోగులకు రూ. 10 వేలు ఇస్తున్నాం. మంచానికే పరిమితమైన వారికి రూ. 15 వేలు పింఛను ఇస్తూ మానవత్వాన్ని నిరూపించుకున్నాం. ప్రతి నెలా ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇచ్చినట్టే పింఛన్లూ అందిస్తున్నాను. ప్రతి నెలా ఒకటిన ఉదయం 10 గంటలకే 80 శాతం పింఛన్లు పంపిణీ పూర్తి చేస్తున్న అధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్నాను.
సూపర్ సిక్స్ తో పేదల జీవితాల్లో వెలుగులు
పేదల జీవితాల్లో వెలుగు రావాలి. వారు ఆనందంగా ఉంటే చూడాలన్నదే నా కోరిక. గత ప్రభుత్వ పాలన చూశాం . రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. అడవి పందుల్లో తిన్నంత తిని నాశనం చేసి పోయారు. నాలుగో సారి ముఖ్యమంత్రి అయిన నాకే ఏమీ అర్ధం కాలేదు. ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నాం, అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తున్నాం. గత ప్రభుత్వం పెట్టిన రూ. 24 వేల కోట్ల బకాయిలు తీర్చాం. గతంలో ఎన్నడూ లేని విధంగా 9 నెలల్లోనే 12.92 శాతం వృద్ధి రేటు సాధించాం. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం లక్ష్యంగా రూ. 3 లక్షల కోట్లతో బడ్జెట్ తెచ్చాం. ఈ ఏడాది జూన్ నాటికి డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తి చేసి పోస్టింగులు ఇస్తాం. మే నెలలో తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎందరు పిల్లలు ఉంటే అందరికి రూ.15 వేలు జమ చేస్తాం. అన్నదాత సుఖీభవ కింద అర్హులైన ప్రతి రైతుకూ ఏటా రూ. 20 వేలు ఇస్తాం. మత్సకారులకు రూ. 20వేలు ఆర్థిక సాయం అందిస్తాము. రూ. 5 కే అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నాం. ఇప్పటికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం.
పీ4తో పేదరిక నిర్మూలన
పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఈనెల 30వ తేదీ ఉగాది నుంచి పీ4కు శ్రీకారం చుట్టబోతోన్నాం. పేదరిక నిర్మూలన విషయంలో ప్రజల అభిప్రాయాలు, ఆలోచనలను తీసుకుని P4 విధానాన్ని అమలు చేస్తాం. ఆర్థికంగా అగ్రస్థానంలో ఉన్న 10 శాతం మంది...అట్టడుగున ఉన్న 20 శాతం మందికి చేయూతను ఇవ్వడం ద్వారా పేదలకు ఆర్థికంగా బలోపేతం చేయవచ్చు. వైసీపీ తప్పుడు విధానాలతో రాష్ట్రాన్ని దోచుకుతింటే ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రతి ఒక్క రూపాయి పేదలకు ఖర్చు చేస్తోంది . నేను చెత్త నుంచి సంపద తయారుచేస్తే గత పాలకులు చెత్త మీద పన్ను వేశారే కానీ ఇంటి ముందు చెత్త తీయలేదు. గత ఐదేళ్లలో ఒక్క గ్రామంలోనూ సిమెంటు రోడ్డు వేయలేదు. గోకులాలూ నేను కట్టించినవే . 9 నెలల్లో 20 వేల కిలోమీటర్లు రోడ్ల మరమ్మతులు చేసి గుంతలు పూడ్చాం. ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నాం. ప్రజలు మెచ్చే విధంగా మెరుగైన పాలన అందిస్తాం. అమరావతి పనులు పట్టాలెక్కాయి. పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రతి ఇంటిపై సోలార్ వెలుగులు రాబోతున్నాయి. ప్రజలందరూ తమ ఇళ్లపై సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తే విద్యుత్ బిల్లుల భారం ఉండదు. ప్రతి ఇల్లూ నెలకు 200 యూనిట్లు ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. ఇంటికో ఎంట్రప్రెన్యూర్ రావాలి. పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య ఖర్చులు భారంగా మారాయి. మధ్య తరగతి ప్రజలకు రూ. 2 లక్షల 50 వేలు వైద్య బీమా సౌకర్యం కల్పిస్తాం. పేదలకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా రూ. 25 లక్షల వరకూ వైద్య ఖర్చులకు సాయం చేస్తాం. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఇల్లు, మంచినీటి కుళాయి , మరుగుదొడ్లు, కరెంటు , దీపం కింద గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలన్నదే నా లక్ష్యం. డ్వాక్రా సంఘాలతో మహిళల ఆర్థిక స్థితిగతులు మరింత మెరుగుపరుస్తాం. చిత్తూరు జిల్లాలో సాగు, తాగు నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటాం.. జిల్లాలో హార్టికల్చర్, డెయిరీ పెరిగింది. మామిడి ఆధార పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పిస్తాం . కేంద్ర నిధులనూ ఇతర అవసరాలకు మళ్లించిన వారి విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రజలను నేను కోరేది ఒక్కటే. ఏ పార్టీ వల్ల లాభమో ప్రజలు ఆలోచించాలి. కులం, మతం, ప్రాంతాల వారీగా విభజించే వారితో రాష్ట్రానికి చేటు తప్పించి ఉపయోగం లేదని సీఎం చంద్రబాబు అన్నారు.