పాలనపై 90 శాతం ప్రజా సంతృప్తి ఉండాలి..అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

అమరావతి: ప్రభుత్వ పాలనపై ప్రజల్లో సానుకూల దృక్పథం పెరిగేలా అధికారులు కఠినంగా శ్రమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు

By -  Knakam Karthik
Published on : 2 March 2026 5:14 PM IST

Andrapradesh, CM Chandrababu, Ap Government, Good Governance, Public Perception, Welfare Schemes

పాలనపై 90 శాతం ప్రజా సంతృప్తి ఉండాలి..అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

అమరావతి: ప్రభుత్వ పాలనపై ప్రజల్లో సానుకూల దృక్పథం పెరిగేలా అధికారులు కఠినంగా శ్రమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో, ప్రభుత్వ సేవలపై ప్రజా సంతృప్తి స్థాయి 80 నుండి 90 శాతానికి తగ్గకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పెన్షన్ల పంపిణీలో ఎక్కడా జాప్యం జరగకూడదని, 'దీపం' పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీలో అదనపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

రాష్ట్రంలోని ఆర్టీసీ బస్టాండ్లలో మౌలిక వసతుల లేమిపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. పుంగనూరు, వెంకటగిరి, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో తాగునీరు, టాయిలెట్లు, ఫ్యాన్ల సౌకర్యం లేకపోవడంపై వస్తున్న ఫిర్యాదులను ప్రస్తావిస్తూ, వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. అలాగే, బాణసంచా ప్రమాదాల నివారణకు తమిళనాడులోని శివకాశీలో అమలు చేస్తున్న రక్షణ చర్యలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.

రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతిని అంతం చేసేందుకు 295 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిజాయితీ కలిగిన అధికారులనే నియమించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి 'వాట్సాప్ మనమిత్ర' సేవలను విస్తృతంగా ప్రచారంలోకి తీసుకురావాలని, అధికారులు కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి పాలనను మెరుగుపరచాలని స్పష్టం చేశారు.

Next Story