ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జపాన్ రాయబారి కెయిచి ఓనో నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు భేటీకి సంబంధించిన ఫొటోలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఈ సమావేశంలో పరస్పర సహాయ సహకారాలపై కీలక చర్చ జరిగినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.
"ఈరోజు అమరావతిలో జపాన్ రాయబారి కెయిచి ఓనో నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సమావేశమయ్యాం. ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, ఆంధ్రప్రదేశ్లో జపాన్ పెట్టుబడులను విస్తరించడంపై చర్చలు జరిగాయి. వృద్ధికి కొత్త అవకాశాలను అందించడానికి నౌకా నిర్మాణం, ఎలక్ట్రానిక్స్, రసాయనాలు, ఆటోమొబైల్స్, విద్య వంటి వివిధ రంగాలలో సహకారాన్ని అన్వేషించడంపై మా చర్చలు కొనసాగాయి" అని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.