రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాల్లోని MSME పార్కులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ప్రకాశం జిల్లా కనిగిరిలోని పెదఈర్లపాడులో ఎంఎస్ఎంఈ పార్కును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు.
By - Knakam Karthik |
రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాల్లోని MSME పార్కులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ప్రకాశం జిల్లా కనిగిరిలోని పెదఈర్లపాడులో ఎంఎస్ఎంఈ పార్కును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాలలోని 50 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకు స్థాపనలు చేశారు. ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు రెండో దశలో ఇవాళ 329 ఎకరాల్లో 15 పారిశ్రామిక పార్కులను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. 587 ఎకరాల్లో మరో 35 ప్రభుత్వ, ప్రైవేటు ఎంఎస్ఎంఈ పార్కులకు సీఎం శంకుస్థాపన చేశారు.
అనంతపురం, కాకినాడ, తూర్పుగోదావరి, ప్రకాశం, కడప, విజయనగరం, పార్వతీపురం మన్యం, సత్యసాయి, ఏలూరు, శ్రీకాకుళం, విశాఖ, కర్నూలు, అన్నమయ్య, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఈ పారిశ్రామిక పార్కులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిగాయి. రాష్ట్రంలో మొత్తంగా 17 జిల్లాల్లో ఎంఎస్ఎంఈ పార్కులకు శ్రీకారం చుట్టారు. 900 ఎకరాల విస్తీర్ణంలో రూ.810 కోట్ల పెట్టుబడులతో ఈ పారిశ్రామిక పార్కులకు ముఖ్యమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
తద్వారా 12 వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు రానున్నాయి. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పెదఈర్లపాడులో 20 ఎకరాల్లో రూ.7 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన ఎంస్ఎంఈ పార్కును ముఖ్యమంత్రి ప్రారంభించారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న ఈ పారిశ్రామిక పార్కుల ద్వారా స్థానికంగా నైపుణ్యం ఉన్న మానవ వనరులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ పారిశ్రామిక పార్కుల్లో ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పాదనకు సిద్ధంగా ఉన్న 28 కంపెనీలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. రూ.25,696 కోట్ల విలువైన పెట్టుబడితో ఈ సంస్థలు పారిశ్రామిక పార్కుల్లో యూనిట్లను ఏర్పాటు చేశాయి. ఉత్తరాంధ్రలో 8, కోస్తాంధ్రలో 6, దక్షిణ కోస్తాలో 6, రాయల సీమలో 8 సంస్థల చొప్పున మొత్తం 28 సంస్థలు ఇవాళ ప్రారంభం అయ్యాయి.