ఏటా 3 పంటల విధానం తీసుకురావాలి..వ్యవసాయ శాఖ అధికారులకు సీఎం సూచన
ఏటా 3 పంటల విధానం తీసుకురావాలని వ్యవసాయ శాఖ అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.
By Knakam Karthik
ఏటా 3 పంటల విధానం తీసుకురావాలి..వ్యవసాయ శాఖ అధికారులకు సీఎం సూచన
అమరావతి: ఖరీఫ్ పంటలను తుఫాన్ల నుంచి రక్షించుకునేలా పంటకాలాన్ని ముందుకు తీసుకురావాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో వ్యవసాయ శాఖ అధికారులు కార్యాచరణ మొదలుపెట్టారు. ఇందుకు అనుగుణంగా గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాలకు ఈ ఏడాది ముందుగానే సాగునీరు విడుదల చేశారు. అధికారులు ఈ మేరకు వివరాలను మంగళవారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన వ్యవసాయ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రికి తెలిపారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో భూములకు కాలువల ద్వారా ఇప్పటికే నీరు విడుదల చేశామని, జూలై మొదటివారంలో గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు నీరు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు. అలాగే రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో ప్రధానంగా వరి, కందులు, వేరుశనగ, ప్రత్తిసాగు చేస్తుండగా... వేరుశనగ, ప్రత్తి సాగు తగ్గుతూ వస్తోందని, కందుల సాగుమాత్రం పెరిగిందని, వరి సాగు స్థిరంగా కొనసాగుతోందని అధికారులు చెప్పారు.
ఇక నుంచి ఏటా 3 పంటలు
365 రోజులు సాగుభూములు పచ్చగా ఉండేలా చూడాలని... ఇందుకోసం 3 పంటల విధానం తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. వచ్చే ఏడాది వేసవిలో ఉత్తర కోస్తా, గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాల్లోని 5 లక్షల ఎకరాల్లో వేసవి పంటలు వేయాలని చెప్పారు. అనంతపురం వంటి జిల్లాల్లో 365 రోజుల్లో కేవలం 4 నెలలే పంటలు సాగు చేసి, 8 నెలల పాటు భూములు ఖాళీగా వదిలేస్తున్నారని...దీనివల్ల భూసారం దెబ్బతింటోందని, అలాకాకుండా మిగిలిన 8 నెలలు కూడా ఏదో ఒక పంట సాగు చేసే పరిస్థితులు కల్పించాలని చెప్పారు. వచ్చే వేసవిలో జలవనరుల లభ్యత ఉన్న 141 మండలాల్లోనూ పంటల సాగు జరిగేలా రైతుల్ని సన్నద్ధం చేయాలన్నారు. ఇందులో 19 మండలాలు రిజర్వాయర్లు, 57 మండలాలు చెరువులు, 65 మండలాలు భూగర్భ జలాలపై ఆధారపడి ఉన్నాయని... వీటిని వినియోగించుకుని దిగుబడులు సాధించాలన్నారు. అలాగే వరిలో అధిక డిమాండ్ ఉన్న సన్నరకాలను పండిచేలా రైతులను ప్రోత్సహించాలని చెప్పారు.
వరి రైతు లాభపడేలా చర్యలు :
వరి రైతుకు ఆదాయం మరింత పెరిగే మార్గాలు చూడాలని అధికారులకు చెప్పిన ముఖ్యమంత్రి... వరిలో అంతర పంటగా గట్లపై కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచే విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలన్నారు. రైతుల పొలం మధ్యలో వెడల్పుగా అదనపు గట్లు వేసేలా అవగాహన కల్పించాలన్నారు. అవసరమైతే ఈ గట్లు నరేగా నిధులతో ఏర్పాటు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. అలాగే వరిపంట మధ్యలో లేదా, పంట చుట్టూ ఆక్వాకల్చర్, హార్టీకల్చర్ సాగును కూడా ప్రయత్నించాలన్నారు.
కొనుగోళ్లతో పొగాకు రైతుల్లో సంతృప్తి :
హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు పర్చూరు ఏఎంసీలో ప్రారంభించామని, దీనిపై రైతుల్లో సంతృప్తి వ్యక్తమైందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. హెచ్డీ బర్లీ స్థానంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. కోకో, మామిడి కొనుగోళ్ల వివరాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్ర ద్వారా కొత్తగా వ్యవసాయ శాఖకు సంబంధించి 3 సేవలు అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. పంటల బీమా, వ్యవసాయ యాంత్రీకరణ, మార్కెఫెడ్కు సంబంధించిన సేవలను ఇకపై వాట్సప్ ద్వారా రైతులు పొందే అవకాశం కలిగిందన్నారు. రైతులకు ఆఫ్ లైన్, ఆన్ లైన్ లో కూడా వ్యవసాయ విజ్ఞానంపై అవగాహన పెంచాలని ముఖ్యమంత్రి అన్నారు.
ఎరువుల వినియోగం తగ్గాలి :
ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి... భూసారాన్ని కాపాడేందుకు కృషి చేయాలి. ఎక్కడా ఎరువుల కొరత లేకుండా చూడాలి... ఎరువులు, పురుగుమందుల వినియోగంపై తాజా సమాచారం ఉండాలి. రాష్ట్రంలో గత ఏడాది పంటకాలంలో 39 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు వినియోగించగా, ఈ ఏడాది దానిని 35 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గించేలా చూడాలి. పల్సెస్, మిల్లెట్స్ సాగు పెరగాలి. ఈ సీజన్లో రైతులు కోరిన 24 గంటల్లో బ్యాంకులు రుణాలు ఇవ్వాలి.’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.