విద్యుత్ ఛార్జీలు, మోటార్లకు స్మార్ట్‌మీటర్లపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

గ్రీన్ ఎనర్జీ కారిడార్‌గా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిద్దిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

By Knakam Karthik
Published on : 14 Aug 2025 7:37 AM IST

Andrapradesh, Cm Chandrababu, Ap Government, Electricity Charges

విద్యుత్ ఛార్జీలు, మోటార్లకు స్మార్ట్‌మీటర్లపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

అమరావతి: గ్రీన్ ఎనర్జీ కారిడార్‌గా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిద్దిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ మారుతున్న డైనమిక్స్‌కు అనుగుణంగా స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో విద్యుత్ సరఫరా పరిస్థితి, విద్యుత్ ప్రాజెక్టులు, పెట్టుబడులు, విద్యుత్ ఛార్జీల భారం తగ్గింపు తదితర అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రస్తుతం పునరుత్పాదక విద్యుత్ వేగంగా విస్తరించి జన జీవనంలోకి వచ్చేసిందని.. ఇక భవిష్యత్ అంతా గ్రీన్ ఎనర్జీదేనని స్పష్టం చేశారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో వ్యయం ఎలా తగ్గించాలన్న అంశంపై అధ్యయనం చేసి ప్రజలకు ఆ ప్రయోజనాలను అందించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వచ్చే రెండు మూడేళ్లలో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం మరో 8.9 శాతం మేర పెరిగే అవకాశముందన్న సీఎం అందుకు అనుగుణంగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు చేసుకోవాలన్నారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి సాంకేతికతను వినియోగించి గ్రీన్ ఎనర్జీలో అతితక్కువ వ్యయంతో విద్యుత్ ఉత్పత్తి చేసే మార్గాలను అన్వేషించాలని అన్నారు. మరోవైపు రాష్ట్రంలోని వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం మోపేందుకు వీల్లేదని సీఎం అధికారులకు తేల్చి చెప్పారు. నాన్ టారిఫ్ ఆదాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. ప్రస్తుతం ఏపీ ట్రాన్స్ కో వేసిన ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్‌ను లీజుకు ఇవ్వటం ద్వారా అదనపు ఆదాయాన్ని సాధించాలని సూచించారు. ఈ మార్గం ద్వారా దాదాపు రూ.7 వేల కోట్ల వరకూ ఆదాయం వచ్చే అవకాశముందని సీఎం అన్నారు.

రాష్ట్రంలో పీఎం- సూర్యఘర్ సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టు ప్రస్తుత పురోగతిపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఎస్సీ, ఎస్టీ బీసీలతో పాటు ఇతర వర్గాలకు సోలార్ రూఫ్ టాప్ కింద ఎన్ని యూనిట్లు ఏర్పాటు చేశారన్న అంశాన్ని ఎప్పటికప్పుడు తెలియచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ పురోగతిపై ప్రతీ నెలా తానే స్వయంగా సమీక్షిస్తానని తెలిపారు. ప్రతీ నియోజకవర్గంలో కనీసం 10 వేల ఇళ్లకు సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టామని, దీనికి అనుగుణంగా కార్యాచరణ చేపట్టాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడా వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు పెట్టవద్దని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అన్ని విద్యుత్ సంస్థలు అందించే పౌర సేవల్ని వాట్సప్ మన మిత్ర ద్వారా అందించాలని పేర్కొన్నారు.

మరోవైపు సెన్సార్లు, డ్రోన్లు ఇతర సాంకేతిక పరికరాల సాయంతో ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితుల్ని అంచనా వేసి అవసరమైన మేరకు విద్యుత్ ఉత్పత్తిని పెంచుకునేందుకు ఆస్కారం ఉందని సీఎం స్పష్టం చేశారు. ఈ ఏడాది మార్చి- ఏప్రిల్ నెలల్లో విద్యుత్ వినియోగం 270 మిలియన్ యూనిట్ల వరకూ పెరిగిందని.. వ్యవసాయానికి కూడా విద్యుత్ వినియోగం పెరిగినట్టు అధికారులు సీఎంకు వివరించారు. ఈ ఏడాది సెప్టెంబరు నుంచి 2026 మార్చి నెలల మధ్య కూడా 12,700 మెగావాట్లకు విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు. దీనిపై స్పందించిన సీఎం విద్యుత్ డిమాండ్ కు తగినట్టుగా ఉత్పత్తి పెంచుకోవాలని ఆదేశించారు. కొనుగోళ్లను తగ్గించేందుకు పవర్ స్వాపింగ్ లాంటి విధానాలను అనుసరించాలని సూచించారు.

Next Story