అమరావతి: పోలవరం జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నం రేవు వద్ద గోదావరిలో విద్యార్థుల గల్లంతుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. ఘటనపై అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. స్నానం చేసేందుకు ఏడుగురు విద్యార్థులు గోదావరిలోకి దిగారని, వారిలో ఐదుగురు గల్లంతయ్యారని అధికారులు వివరించారు.
గల్లంతైన వారిలో అభిరామ్, శ్రీకర్, నవదీప్ అనే విద్యార్థులు ముగ్గురు మృతి చెందారని, మిగిలి ఇద్దరు విద్యార్థులైన సతీష్ కుమార్, తేజ ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీపక్, హర్ష ప్రాణాలతో బయటపడ్డారని వివరించారు. విద్యార్థులంతా అమరావతిలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీకి చెందిన వారని తెలిపారు. ఆచూకీ లభ్యం కాని ఇద్దరు విద్యార్థుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు.