కైకలూరులో వంగవీటి మోహన్రంగా విగ్రహం పట్ల గుర్తుతెలియని దుండగులు దుశ్చర్యకు పాల్పడటాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఏలూరు జిల్లా, కైకలూరు నియోజకవర్గం, కలిదిండిలో మోహన్ రంగా విగ్రహాన్ని అవమానపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు జారీ చేశారు. అభిమానుల మనోభావాలు దెబ్బతినేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ ఘటనలో నిందితులను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. నేతల విగ్రహాల పట్ల అవమానకర చర్యలకు పాల్పడేవారికి గట్టి గుణపాఠం చెప్పేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు.