ఆ వింత ప్రతిపాదన, జగన్ విద్వేషానికి పరాకాష్ట..అమరావతిదే అంతిమ విజయం: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.

By -  Knakam Karthik
Published on : 2 April 2026 2:03 PM IST

Andrapradesh, Amaravati, AP Capital Bill, CM Chandrababu, ParliamentSuccess

ఆ వింత ప్రతిపాదన, జగన్ విద్వేషానికి పరాకాష్ట..అమరావతిదే అంతిమ విజయం: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. గురువారం ఎన్డీయే నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతంలోని ప్రతి గ్రామంలో పండుగ వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా సహకారానికి కృతజ్ఞతలు తెలుపుతూ, తానే స్వయంగా రాజధాని శంకుస్థాపన జరిగిన పవిత్ర స్థలం ఉద్దండరాయునిపాలెం వెళ్లి వేడుకల్లో పాల్గొంటానని ప్రకటించారు. ఐదేళ్ల పాటు రాజధాని లేకుండా రాష్ట్రాన్ని అయోమయంలో నెట్టిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వైఖరిని ఆయన తీవ్రంగా విమర్శించారు.

అమరావతి పేరు పలకడానికి కూడా ఇష్టపడని జగన్, ఇప్పుడు 'మావిగుంట' (Mavigun) వంటి వింత ప్రతిపాదనలు తీసుకురావడం ఆయన విద్వేషానికి పరాకాష్ట అని చంద్రబాబు మండిపడ్డారు. మూడు రాజధానులంటూ గతంలో ఎగతాళి చేసిన వారికి పార్లమెంటు బిల్లుతో గట్టి సమాధానం లభించిందని, ఇకపై అమరావతి ఒక్కటే ఏపీ రాజధాని అని సగర్వంగా చెప్పుకోవచ్చని అన్నారు. అదే సమయంలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ వేడుకల్లో జనసేన, బీజేపీ శ్రేణులు కూడా ఉత్సాహంగా పాల్గొనాలని మంత్రులు నాదెండ్ల మనోహర్, మాధవ్ పిలుపునిచ్చారు. అమరావతి మన రాజధాని అనే భావం ప్రతి పౌరుడిలో ఉండాలని సీఎం ఆకాంక్షించారు.

Next Story