గత పాలకులు విపత్తు నిధినీ ఖాళీ చేశారు, ఆదుకోండి..కేంద్రబృందానికి సీఎం రిక్వెస్ట్

ఆంధ్రప్రదేశ్‌కు మొంథా తుపాను కారణంగా వాటిల్లిన నష్టంపై త్వరితగతిన నివేదిక ఇచ్చి ఉదారంగా ఆదుకునేలా సిఫార్సు చేయాలని కేంద్ర బృందాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు

By -  Knakam Karthik
Published on : 12 Nov 2025 7:21 AM IST

Andrapradesh, Amaravati, CM Chandrababu, Cyclone Montha damage, central team

గత పాలకులు విపత్తు నిధినీ ఖాళీ చేశారు, ఆదుకోండి..కేంద్రబృందానికి సీఎం రిక్వెస్ట్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు మొంథా తుపాను కారణంగా వాటిల్లిన నష్టంపై త్వరితగతిన నివేదిక ఇచ్చి ఉదారంగా ఆదుకునేలా సిఫార్సు చేయాలని కేంద్ర బృందాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. తుపాను కారణంగా ఇళ్లు, రహదారులు, విద్యుత్ స్తంభాలు, పంటలు, ఆక్వా, చేనేత రంగాలు దెబ్బతిన్నాయని అన్ని రంగాల్లో మొత్తంగా రూ.6384 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు కేంద్ర బృందానికి సీఎం వివరించారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో తుపాను నష్టంపై అంచనాకు వచ్చిన కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పాసుమీ బసు నేతృత్వంలోని కేంద్ర బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైంది. క్షేత్రస్థాయిలో జరిపిన పరిశీలనల్ని సీఎం దృష్టికి తీసుకువచ్చింది. రెండు బృందాలుగా వేర్వేరు ప్రాంతాల్లో పర్యటించి తుపాను నష్టాన్ని అంచనా వేశామని వివరించింది. కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో వేర్వేరు ప్రాంతాలను సందర్శించినట్టు తెలిపింది. మొంథా తుపాను, భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టంపై రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రజంటేషన్ ద్వారా కేంద్ర బృందానికి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 443 మండలాల్లోని 3,109 గ్రామాలు మొంథా తుపాను కారణంగా ప్రభావితం అయ్యాయని ప్రభుత్వం నివేదికలో పేర్కోంది.

దాదాపు 10 లక్షల మంది తుపానుతో పాటు భారీ వర్షాలకు ప్రభావితం అయ్యారని వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 9,960 ఇళ్లు నీట మునిగాయని 1.11 లక్షల కుటుంబాలు నిరాశ్రయులయ్యారని ప్రభుత్వం పేర్కోంది. తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు 4,566 ఇళ్లు దెబ్బతిన్నట్టు వివరించింది. 1.61 లక్షల హెక్టార్లలో పంట దెబ్బతిందని.. 3.27 లక్షల మంది రైతులు నష్టపోయారని కేంద్ర బృందానికి నివేదించింది. వ్యవసాయ పంటలతో పాటు ఆక్వా, పశుసంవర్ధకం, చేనేత రంగం కూడా తీవ్రంగా నష్టపోయినట్టు వెల్లడించింది.

4,794 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని, 12,856 విద్యుత్ స్తంభాలు నేల కూలినట్టు తెలిపింది. అలాగే 2,318 విద్యుత్ ట్రాన్సఫార్మర్లు పాడయ్యాయని నివేదికలో పేర్కొంది. మొంథా తుపాను వల్ల నష్టపోయిన ప్రజల్ని ఆదుకునేందుకు 22 జిల్లాల్లో 1.92 లక్షల మందిని రిలీఫ్ క్యాంపులకు తరలించామని ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం 3.36 లక్షల కుటుంబాలకు రూ.3 వేల చొప్పున తక్షణ ఆర్ధిక సాయంగా అందించినట్టు కేంద్ర బృందానికి వివరించింది. రాష్ట్రంలో రహదారులు, విద్యుత్ లాంటి మౌలిక సదుపాయాలను తక్షణం పునరుద్ధరించేందుకు తక్షణ సాయంగా రూ.2,622 కోట్లను మంజూరు చేయాల్సిందిగా ప్రభుత్వం కేంద్ర బృందానికి నివేదించింది.

త్వరితగతిన సాయం వచ్చేలా చూడండి

రాష్ట్రంలో జరిగిన తుపాను నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించినందున త్వరితగతిన నివేదిక ఇచ్చి రాష్ట్రాన్ని ఆదుకోవాలని సీఎం కేంద్ర బృందాన్ని కోరారు. ఏపీ నుంచి రెండు రోజుల్లో తుది అంచనాలను కూడా పంపుతామని తెలిపారు. దీనిపై స్పందించిన కేంద్ర బృందం.. త్వరితగతిన కేంద్రానికి సిఫార్సులు చేస్తామని వెల్లడించింది. ఆర్టీజీఎస్ నుంచి ముందస్తు హెచ్చరికలు పంపి సరైన సమయంలో విలువైన ప్రాణాల్ని కాపాడగలిగారని కేంద్ర బృందం ముఖ్యమంత్రిని కొనియాడింది. రెస్క్యూ బృందాలను, వనరుల్ని ముందుగానే పంపి ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించారని అభిప్రాయపడింది. గర్భిణుల్ని కూడా ముందస్తుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించి వైద్యసేవలు సత్వరం అందేలా చూసిన విషయాన్ని కూడా గుర్తించామని కేంద్ర బృందం సీఎంకి తెలిపింది. భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు వచ్చి పంటలు నీట మునిగినట్టు క్షేత్రస్థాయి పర్యటనలో గుర్తించామన్నారు. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు నిబంధనలు సవరించేలా సిఫార్సు చేయాలని సీఎం కోరారు. పత్తి రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ఓవైపు రాష్ట్ర విభజన, మరోవైపు గత పాలకుల విధ్వంస పాలన ఏపీని తీవ్రంగా నష్ట పరిచిందని ముఖ్యమంత్రి కేంద్ర బృందానికి తెలిపారు. రాష్ట్ర విపత్తు నిధుల్ని కూడా దారి మళ్లించారని, కేంద్ర ప్రాయోజిత పథకాలను కూడా నిలిపివేశారని.. ఈ అంశాన్ని కేంద్రానికి కూడా నివేదించామని సీఎం అన్నారు. గత ప్రభుత్వ విధ్వంస పాలన కారణంగా ఏర్పడిన లోటుపాట్లను సవరించుకునే ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం వివరించారు.

Next Story