పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 18 నెలల్లో పెన్షన్ల పంపిణీ కోసమే రూ.50,763 కోట్లు ఖర్చు చేశామని, దేశంలో ఎక్కడా ఈ స్థాయిలో సంక్షేమం కోసం వ్యయం చేస్తున్న రాష్ట్రం మరొకటి లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్ఫష్టం చేశారు.
By - Medi Samrat |
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 18 నెలల్లో పెన్షన్ల పంపిణీ కోసమే రూ.50,763 కోట్లు ఖర్చు చేశామని, దేశంలో ఎక్కడా ఈ స్థాయిలో సంక్షేమం కోసం వ్యయం చేస్తున్న రాష్ట్రం మరొకటి లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్ఫష్టం చేశారు. పెన్షన్ల పంపిణీతో పేదల జీవితాల్లో వెలుగులు నింపామని అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించే అవకాశం ప్రజలు తమకు ఇచ్చారని ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టే సూపర్ సిక్స్ విజయవంతంగా అమలు చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గోపీనాథపట్నంలో పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తురాలు నాగలక్ష్మి ఇంటికి వెళ్లి పింఛను అందజేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అనంతరం ప్రజా వేదిక సభకు హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
పింఛన్ల పంపిణీలో రికార్డు సృష్టించాం
ఈ నెల 14వ తేదీకి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 18 నెలలు పూర్తి అవుతుంది. ఇప్పటి వరకూ పింఛన్ల కోసం రూ. 50,763 కోట్లు ఖర్చు చేశాం. ఏటా రూ.32,143 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.1 లక్షా 65 వేల కోట్లు పింఛన్ల కోసమే ఖర్చు చేస్తున్నాం. పొరుగు రాష్ట్రాలు తెలంగాణా, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, అతిపెద్ద రాష్ట్రం యూపీలోనూ ఈ స్థాయిలో అక్కడి ప్రభుత్వాలు వ్యయం చేయటం లేదు. 63 లక్షల పైచిలుకు మందికి రూ.2,739 కోట్లు పెన్షన్ల రూపంలో అందిస్తున్నాం. రాష్ట్రంలోని ప్రతీ వంద మందిలో 13 మందికి పెన్షన్లు అందిస్తున్నాం. ప్రతినెలా పింఛన్లు అందుకుంటున్న వారిలో 59 శాతంమంది మహిళలే. అంటే ఇప్పటి వరకు ఇచ్చిన రూ.50 వేల కోట్లలో రూ.30 వేల కోట్లు ఒక్క మహిళలకే ఇచ్చాం. గత ప్రభుత్వంలో భర్త చనిపోతే భార్యకు పింఛన్ అందలేదు. కూటమి ప్రభుత్వంలో ఆ ఇబ్బందుల లేవు. ఈ నెలలో కొత్తగా 7,533 మందికి రూ.3 కోట్లతో వితంతు పింఛన్లు ఇస్తున్నాం. గడిచిన ఐదేళ్లలో ఒక్క నెల పింఛను తీసుకోకపోయినా ఎగ్గొట్టేవారు. ప్రభుత్వంలో 2 నెలలుగా పెన్షన్ తీసుకోని 1,39,677 మందికి రూ.114 కోట్లు, 3 నెలలుగా పెన్షన్ తీసుకోని 13,325 మందికి రూ.16 కోట్లు విడుదల చేశాం. 1984లో ఎన్టీఆర్ పింఛన్లకు శ్రీకారం చుట్టారు. దాన్ని క్రమంగా పెంచుతూ ప్రస్తుతం రూ.4000 ఇస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులున్నా బాధ్యతగా ప్రతి నెలా ఒకటో తేదీన ఠంచనుగా పింఛను అందిస్తుంటే...గత ప్రభుత్వంలో ఐదేళ్లు ముక్కుతూ,మూలుగుతూ రూ.250 మాత్రమే పెంచారు. అని సీఎం చంద్రబాబు అన్నారు.
అర్హులందరికీ సంక్షేమం వర్తింపు
ఓ వైపు సంక్షేమం అమలు చేస్తూనే మరో వైపు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నాం. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే వారందరికీ తల్లికి వందనం కింద రూ.15 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నాం. జనాభా సమతౌల్యం కోసం ఆలోచన చేయాలి. అప్పుడే దేశం, రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తాయి. కానీ కాలక్రమంలో జనాభా తగ్గుదల ఆందోళన కలిగిస్తోంది. దీపం-2 కింద ఏటా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. ఇప్పటి వరకు 2.85 కోట్ల సిలిండర్లు ఉచితంగా అందించాం. ఇందుకోసం రూ. 2,104 కోట్లు ఖర్చు చేశాం. స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సులో నేటి వరకు మహిళలు 25 కోట్ల ప్రయాణాలు చేశారు. గత ఐదేళ్లలో స్కూళ్లలో కనీసం సరిపడా టీచర్లు కూడా లేరు. కూటమి ప్రభుత్వం వచ్చాక మెగా డీఎస్సీతో 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేశామని ముఖ్యమంత్రి తెలిపారు.
అన్నదాత అభివృద్ధికి పంచ సూత్రాలు
వ్యవసాయం చేసే రైతు నష్టపోకుండా ఉండేందుకు పంచ సూత్రాలు అమలు చేస్తున్నాం. వాటర్ సెక్యూరిటీ, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతు ద్వారా సాగును లాభసాటి చేసేందుకు ప్రణాళిక అమలు చేస్తున్నాం. డిసెంబర్ 3వ తేదీన రైతన్నా మీకోసం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సమాజంలో ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. వాటికి తగ్గనట్లు మనం కూడా సాగు విధానం మార్చుకోవాలి. రైతులు డిమాండ్ ఆధారిత పంటలను సాగు చేయాలి. ఆరోగ్య సమస్యల భయంతో ప్రపంచవ్యాప్తంగా అన్నం తినే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. సమీకృత వ్యవసాయ విధానాలను అవలంబించాలి. టెక్నాలజీ సాయంతో వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50కే ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నాం. ఆక్వా కల్చర్ అభివృద్ధి చెందేందుకు రూ.850 కోట్ల వ్యయాన్ని ప్రభుత్వం భరిస్తుంది. ధాన్యం కొనుగోలు చేసిన 24 నుంచి 48 గంటల్లోనే డబ్బులు రైతుల అకౌంట్లలో వేస్తున్నాం. జిల్లాలో వ్యవసాయరంగానికి ప్రాధాన్యత ఇస్తూనే పరిశ్రమలు తీసుకొస్తున్నాం. కొబ్బరి, కోకో, కాఫీ లాంటి పంటలకు ఈ ప్రాంతం అనువైనది. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు కూడా రావాలి. దశాబ్దాలుగా నెలకొన్న కొల్లేరు సమస్యను పరిష్కరించి రైతులకు న్యాయం చేస్తాం. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తాం. అన్ని చెరువులకు నీరందింస్తాం అని సీఎం చంద్రబాబు అన్నారు.
20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు
మరో 15 ఏళ్లు కూటమి అధికారంలో ఉండాలని మిత్రులు పవన్ కల్యాణ్ ఎప్పుడూ అంటుంటారు. ఇటీవల విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇప్పటికే రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపాం. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. విశాఖ నగరానికి గూగుల్ డేటా సెంటర్ వచ్చిందంటే అందుకు ప్రభుత్వంపై ఉన్న విశ్వసనీయతే కారణం. దేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాక రూ.1.40 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం మొదటిసారి. ప్రతి నియోజకవర్గంలో మూడు నెలలకు ఓసారి జాబ్ మేళాలు నిర్వహిస్తాం. 2027 నాటికి గోదావరి పుష్కరాలకంటే ముందే పోలవరం పూర్తిచేసి జాతికి అంకితం చేస్తాం. పోలవరం పూర్తయితే నీటి ఎద్దడి ఉండదు. పొలాలకు రేట్లు పెరుగుతాయి. హైదరాబాద్ లో చేసిన అభివృద్ధి ఫలాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు కోకాపేటలో ఎకరా రూ.10 వేలు ఉంటే నేడు రూ.160 కోట్ల వరకూ వెళ్లింది. అభివృద్ది జరిగితే భూముల ధరలు పెరుగుతాయి. కియా కార్ల పరిశ్రమ రాకతో అనంతపురం పెనుగొండ ప్రాంతంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అక్కడ ఎకరం రూ.10 లక్షలు ఉండే భూమి ఇప్పుడు కోట్లలో పలుకుతోంది. ఏపీ అభివృద్ధి లక్ష్యంగా మూడు ప్రాంతీయ జోన్లు ఏర్పాటు చేస్తున్నాం. అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి. 2028 నాటికి అమరావతి ఫేజ్ 1 పనులు పూర్తవుతాయి. ప్రపంచంలోనే సుందర నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతాం. తిరుపతిని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.
గడిచిన ఐదేళ్లలో అభివృద్ధి ఊసే లేదు
గత పాలకులకు దోచుకోవడం, దాచుకోవడమే తెలుసు. అభివృద్ధి అంటే వారికి నచ్చదు. గతంలో నేను ముఖ్యమంత్రిగాచేసిన అభివృద్ధిని తర్వాత వచ్చినవాళ్లు అడ్డుకోలేదు. గత పాలకులు మాత్రం రాష్ట్రాన్ని గంజాయికి కేరాఫ్ అడ్రస్ గా మార్చారు. గంజాయి డాన్ గా మారిన ఓ మహిళ కూడా ఇప్పుడు బయట పడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రమాదకరమో ఈ ఘటన ఒక్కటే చాలు. బాబాయిని గొడ్డలితో చంపి వేరే వారిపై నెపం నెట్టే తరహా నేరాలు రాష్ట్రంలో నడిపిస్తున్నారు. గత ప్రభుత్వంలో దేవాలయాలపై దాడులు జరిగాయి. ఆలయాలు, ప్రార్థనా మందిరాలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం. జనవరి కల్లా గుంతలు పడిన రోడ్లన్నీ మరమ్మతులు చేస్తాం. ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. టాటా సంస్థ సహకారంతో డిజిటల్ నెర్వ్ సెంటర్ సంజీవని ప్రాజెక్టును తీసుకొచ్చాం. ప్రతి ఒక్కరి హెల్త్ కార్డులను డిజిటలైజ్ చేసే ప్రక్రియ చేపట్టాం. తలసరి ఆదాయం రూ.58 లక్షలకు పెంచడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. ప్రధాని మోదీ సమర్థ నాయకత్వంలో 2047 నాటికి ప్రపంచంలో నెంబర్ వన్ గా మనదేశం నిలుస్తుంది. అప్పటికి మన స్వర్ణాంధ్ర కల సాకారమవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. అనంతరం ప్రజావేదిక సభలో పీ4 కార్యక్రమానికి సంబంధించి బంగారు కుటుంబాలను, మార్గదర్శులను సీఎం అభినందించారు. అంతకుముందు ప్రజా వేదిక సమీపంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సీఎం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కొలుసు పార్ధసారధి ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.