వ్యాపారం చేసి పన్నులు ఎగవేద్దామంటే కుదరదు: సీఎం చంద్రబాబు
రాష్ట్ర ఆదాయానికి గండికొడితే చూస్తూ ఊరుకునేది లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు
By Knakam Karthik
వ్యాపారం చేసి పన్నులు ఎగవేద్దామంటే కుదరదు: సీఎం చంద్రబాబు
రాష్ట్ర ఆదాయానికి గండికొడితే చూస్తూ ఊరుకునేది లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అధికారులకు రెవెన్యూ లక్ష్యాలకు సంబంధించి ముఖ్యమైన సూచనలు చేశారు. సమయానికి పన్ను వసూళ్లలో వ్యాపారులు, పన్ను చెల్లింపుదారులను ఇబ్బందులకు గురి చేయొద్దని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి వారిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు.
వ్యాపారం చేసి పన్నులు ఎగవేద్దామంటే కుదరదని తేల్చి చెప్పారు. పన్ను ఎగవేతకు దారులు మూసివేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. వ్యవస్థలో లొసుగులను వాడుకుని ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించేందుకు ప్రయత్నించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు. ఏపీలో పెట్టుబడిదారులకు, వ్యాపారులకు ఉన్న అనుకూలతలు వివరిస్తూనే పన్నులు ఎగవేస్తే కఠిన చర్యలు తప్పవన్న విషయం అర్థమయ్యేలా అధికారులు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.
పన్ను చెల్లింపులకు సంబంధించి 2017 నుంచి ఉన్న సమాచారాన్ని విశ్లేషించాలని సీఎం సూచించారు. ఎగవేతదారులకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాల గురించి కూడా పునరాలోచన చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ శాఖలు చేసే పన్ను వసూళ్లకు సంబంధించి ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ కూడా చేస్తామన్నారు. ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తం కావటమే కూటమి ప్రభుత్వానికి ముఖ్యమని చెప్పారు. ఈ క్రమంలో 2025-2026 ఆర్థిక సంవత్సరానికి రూ.1.24 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్టు అధికారులు సీఎంకు తెలిపారు.