దీపావళి వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో తీపి కబురు అందించారు. పరిశ్రమలకు మద్దతుగా, వ్యాపారాలకు ఏపీని గమ్యస్థానంగా నిలిపేందుకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. పరిశ్రమలకు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ విడుదలకు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే తొలి విడతగా రూ.1500 కోట్ల పారిశ్రామిక రాయితీల విడుదలకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా ఆంధ్రప్రదేశ్ ప్రగతిలో భాగస్వాములైన పారిశ్రామికవేత్తలకు అండగా నిలవాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో చిన్న, మధ్య తరహా వ్యాపారులకు భారీ ఊరట లభించనుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదలకు సంక్షేమ పథకాలు, పెట్టుబడులతో ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక చెల్లింపులు, వ్యాపారస్తులకు ప్రోత్సాహకాలు అందిస్తూ అన్ని వర్గాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.