చిత్తూరు జిల్లా కుప్పంలో బుధవారం పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానిక ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరలో కుటుంబసమేతంగా పాల్గొన్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆలయం పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. జాతర కు వచ్చిన ముఖ్యమంత్రి దంపతులు టీటీడీ తరపున గంగమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం సీఎం చంద్రబాబు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, అర్చకులు తీర్ధప్రసాదాలు అందించారు. ఏడాదికి ఒకసారి మాత్రమే లభించే గంగమ్మ విశ్వరూప దర్శనాన్ని చేసుకుని, రాష్ట్రాన్ని గంగమ్మ చల్లంగా చూడాలని, ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ముఖ్యంగా కుప్పం ప్రాంతంలో ప్రభుత్వం తలపెట్టిన అభివృద్దిపనులు అన్నీ సకాలంలో పూర్తి అయ్యేలా, ప్రజలకు అభివృద్ది ఫలాలు లభించేలా కరుణించాలని ప్రార్థించినట్లు సిఎం తెలిపారు. సీఎం చంద్రబాబుతో పాటు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ బోర్డు సభ్యులు, పలువురు నాయకులు జాతరలో పాల్గొన్నారు. గంగమ్మ దర్శనానికి ముందుగా కుప్పం పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబుకు జిల్లా అధికారులు, స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. గంగమ్మ దర్శనం అనంతరం బెంగుళూరు మీదుగా సీఎం చంద్రబాబు అమరావతికి తిరుగు ప్రయాణమయ్యారు.