పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలు..సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

వైసీపీ పాల‌న‌లో అసంపూర్తిగా ఉన్న‌ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిన చేపడుతున్నా... పర్యవేక్షణ, అజమాయిషీ మాత్రం ప్రభుత్వం చేపడుతుందని ముఖ్యమంత్రి చంద్ర‌బాబు స్పష్టం చేశారు

By -  Knakam Karthik
Published on : 21 Nov 2025 7:27 PM IST

Andrapradesh, Amaravati, CM Chandrababu, Chief Minister Chandrababu, health department

పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలు..సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

అమరావతి: వైసీపీ పాల‌న‌లో అసంపూర్తిగా ఉన్న‌ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిన చేపడుతున్నా... పర్యవేక్షణ, అజమాయిషీ మాత్రం ప్రభుత్వం చేపడుతుందని ముఖ్యమంత్రి చంద్ర‌బాబు స్పష్టం చేశారు. పేదలకు ఉచితంగా మెరుగైన సేవలు అందించేందుకు మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపడుతున్నట్టు వెల్లడించారు. వైద్యారోగ్య శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. మెడికల్ కాలేజీల నిర్మాణం, కుప్పంలో సంజీవని ప్రాజెక్టు అమలు, యూనివర్శల్ హెల్త్ స్కీంపై అధికారులతో సీఎం సమీక్షించారు.

పీపీపీ కింద తొలి విడతలో చేపట్టనున్న ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల మెడికల్ కాలేజీల నిర్మాణ ప్రక్రియ ముఖ్యమంత్రి ఆరా తీశారు. ప్రస్తుతం టెండర్ ప్రక్రియలో భాగంగా నాలుగు దశలు దాటామని..వచ్చే నెలాఖరు నాటికి టెండర్ ప్రక్రియను పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు. మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి వచ్చేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. పీపీపీ విధానంలో చేపడుతున్న వైద్య కళాశాలల ద్వారా నగరాలు, పట్టణ ప్రాంతాల్లో మాత్రమే అందే ఆధునిక వైద్య సదుపాయాలు గ్రామీణ ప్రాంతాలకూ అందుతాయని సీఎం అన్నారు. ప్రజలకు, విద్యార్ధులకు అంతిమంగా మొత్తం సమాజానికి ఈ మెడికల్ కాలేజీలతో ప్రయోజనం కలుగుతుందని స్పష్టం చేశారు.

ప్రస్తుతం ప్రభుత్వం పిపిపిలో చేపడుతున్న ఒక్కో మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం 50 ఎకరాలు కేటాయించాం. ఈ 50 ఎకరాల్లో 25 ఎకరాలు మెడికల్ కాలేజీ, ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలని. మిగిలిన 25 ఎకరాల్లో నర్సింగ్, పారామెడికల్, డెంటల్ లాంటి ఆయుర్వేద, వెల్ నెస్ సెంటర్, యోగా కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి ఇంటిగ్రేట్ చేయాలని సిఎం చంద్ర‌బాబు సూచించారు. ఆస్పత్రుల్లో 70 శాతం మేర పడకలు పేదలకు ఉచితంగా కేటాయిస్తున్నామ‌ని సిఎం చంద్ర‌బాబు మ‌రో సారి స్ప‌ష్టం చేశారు. అలాగే వైద్య సేవలు కూడా ఉచితంగానే ఉన్నాయని. దేశవ్యాప్తంగా వివిధ మోడళ్లల్లో నిర్వహిస్తున్న ఆస్పత్రులు ఉన్నాయని. వాటిని ఆధ్యయనం చేయాల‌ని అధికారుల‌కు సూచించారు. రోగుల మెరుగైన, నాణ్యమైన సేవలు సులభంగా అందాలని. ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం ఈ వైద్య కళాశాలలు పనిచేసేలా చూడాలన్నారు. బెస్ట్ ప్రాక్టీసెస్ చేస్తున్న ఆస్పత్రులకు రేటింగ్ ఇవ్వాల‌ని. నీతి ఆయోగ్ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగానే ప్రమాణాలు, నిబంధనలు ఉండాల ని సీఎం చంద్రబాబు అధికారుల‌కు సూచించారు..

కుప్పంలో పైలట్ గా అమలు చేస్తున్న డిజినెర్వ్ సెంటర్ సంజీవని ప్రాజెక్టు రాష్ట్రానికి ఓ గేమ్ చేంజర్ గా మారుతుందని సిఎ చంద్ర‌బాబు అన్నారు. వైద్యారోగ్య రంగంలో దేశం మొత్తానికి ఓ దిక్సూచిగా ఈ ప్రాజెక్టు నిలిచే అవకాశం ఉంటుందని అన్నారు. డిజిటల్ హెల్త్ రికార్డులను ద్వారా ప్రజారోగ్యాన్ని పర్యవేక్షిస్తామని సిఎం అన్నారు. ప్రస్తుతం కుప్పంలో పైలట్ గా చేస్తున్న సంజీవని ద్వారా 3.38 లక్షల మందికి సంబంధించిన ఆరోగ్య వివరాలను సేకరించాలని సూచించారు. కుప్పంలో రిజిస్టర్ అయిన ప్రజలకు పరీక్షలు నిర్వహించి వ్యాధుల ప్రొఫైల్స్ ను సిద్ధం చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా కుప్పంలో ప్రజల ఆరోగ్య పరిస్థితి డిజిట్ హెల్త్ రికార్డులు సిద్ధం చేయాల‌న్నారు.

Next Story