అమరావతిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో ఆ శిక్షణా కేంద్రం పెట్టండి..కేంద్ర క్రీడా మంత్రికి సీఎం రిక్వెస్ట్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయతో సమావేశం అయ్యారు.

By Knakam Karthik
Published on : 16 July 2025 10:45 AM IST

Andrapradesh, Amaravati, Cm Chandrababu, Union Sports Minister Mansukh Mandaviya,

అమరావతిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో ఆ శిక్షణా కేంద్రం పెట్టండి..కేంద్ర క్రీడా మంత్రికి సీఎం రిక్వెస్ట్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు వినతులు చేశారు. అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సహకరించాలని కేంద్రమంత్రిని కోరారు. అమరావతిలో జాతీయ జల క్రీడల శిక్షణా హబ్‌ ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. కృష్ణా నదీ తీరంలో వాటర్ స్పోర్ట్స్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు. క్రీడలకు సంబంధించి వివిధ మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి ప్రాజెక్టులపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రతిపాదల్ని పంపినట్లు సీఎం తెలిపారు.

నాగార్జున యూనివర్సిటీ, కాకినాడలలో నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ల ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు సీఎం వెల్లడించారు. తిరుపతి, రాజమహేంద్రవరం, కాకినాడ, నరసరావుపేటలలో ఖేలో ఇండియా కింద మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల పూర్తికి రిక్వెస్ట్ చేశారు. విజయవాడ ఇందిరగాంధీ స్టేడియం డెవలప్‌మెంట్‌కు రూ.27 కోట్లు, గుంటూరు బీఆర్ స్టేడియంలో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు రూ.170 కోట్లు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి రూ.341 కోట్లు మంజూరు చేయాలని కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయను సీఎం చంద్రబాబు కోరారు.

జిల్లాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించేందుకు అదనంగా ఖేలో ఇండియా కేంద్రాలను మంజూరు చేయాలని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేశారు. రాయలసీమలోని తిరుపతి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణా కేంద్రం ఏర్పాటును పరిశీలించాలని సీఎం కోరారు. 2024-2029 స్పోర్ట్స్ పాలసీలో భాగంగా ఏపీలో స్పోర్ట్స్ ఎకో సిస్టం అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు కేంద్రమంత్రికి సీఎం వివరించారు. ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ 2025ను ఏపీలో నిర్వహించేందుకు అవకాశం ఇవ్వడంపై కేంద్ర మంత్రి మాండవీయకు ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ, విశాఖ తదితర నగరాల్లో అత్యుత్తమ క్రీడా వేదికలపై వీటిని నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ నిర్వహణకు రూ.25 కోట్లు విడుదల చేయాలని మాండవీయను సీఎం చంద్రబాబు కోరారు.

Next Story