జాప్యం లేకుండా రాజధాని నిర్మాణ పనులు జరగాలి

రాజధాని నిర్మాణ పనులు జాప్యం లేకుండా జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

By -  Medi Samrat
Published on : 31 Oct 2025 6:22 PM IST

జాప్యం లేకుండా రాజధాని నిర్మాణ పనులు జరగాలి

రాజధాని నిర్మాణ పనులు జాప్యం లేకుండా జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నిర్దేశించుకున్న లక్ష్యానికి నిర్మాణాలు పూర్తి కావాలని చెప్పారు. రాజధాని నిర్మాణ పనుల పురోగతి, బ్యూటిఫికేషన్, రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ వంటి అంశాలపై శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఏయే నిర్మాణాలను ఎంత వరకు పూర్తి చేశారు..? వర్క్ ఫోర్స్ ఏ మేరకు ఉంది..? నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్, మెషినరీని ఆయా సంస్థలు ఏ మేరకు సమకూర్చుకున్నాయనేదానిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏయే భవనాలను ఎప్పటిలోగా పూర్తి చేయాలో నిర్ధిష్ట సమయాన్ని నిర్దేశించుకున్నామని... ఆ మేరకు పనులను పూర్తి చేయాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. నిర్మాణాల్లో వేగంతో పాటు.. నాణ్యత ప్రమాణాలను పక్కాగా పాటించాలని ఆదేశించారు. పనుల పురోగతిపై ప్రతి 15 రోజులకోసారి సమీక్షిస్తానని చెప్పారు. ప్రస్తుతం వర్షాల కారణంగా నిర్మాణ పనుల్లో కొంత మేర జాప్యం జరిగినా.. రానున్న రోజుల్లో దాన్ని భర్తీ చేసేలా నిర్మాణాల్లో వేగం పెంచాలని చంద్రబాబు సూచించారు. ఇంకా కొన్ని నిర్మాణ సంస్థలు వర్క్ ఫోర్స్, మెషీనరీని పూర్తి స్థాయిలో కేటాయించలేదని... ఇలా ఉన్న సంస్థలు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇక రాజధాని భవనాల నిర్మాణాలకు అవసరమైన గ్రావెల్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని అన్నారు. ఈ మేరకు గనుల శాఖతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారు.

రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లలో రైతులకు ఇబ్బందులు రానివ్వొద్దు

రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎంతవరకు పూర్తైందని సీఎం ఆరా తీశారు. రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ల విషయంలో రైతులకు ఏ మాత్రం ఇబ్బందులు రానివ్వొద్దని మంత్రి నారాయణ, అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వివరాలు అధికారులు అందించారు. ఇంకా 2,471 మంది రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను రిజిస్ట్రేషన్లు చేయాల్సి ఉందని.. ఇవి కూడా చిన్నపాటి సాంకేతిక, రైతుల వ్యక్తిగత అంశాల కారణంగా పెండింగులో ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. తాను కూడా త్వరలోనే రాజధాని రైతులతో సమావేశమవుతానని ముఖ్యమంత్రి తెలిపారు. రాజధానిలో నిర్మాణాలకు ఎంతటి ప్రాధాన్యమిస్తున్నామో..గ్రీనరీ, సుందరీకరణ, పరిశుభ్రతకు కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. రాజధానుల గార్డెనింగ్, బ్యూటిఫికేషన్ వంటి వాటిల్లో ఎలాంటి రాజీపడొద్దని సూచించారు. ఇక ప్రైవేట్ సంస్థలు చేపట్టే నిర్మాణాలు కూడా ఐకానిక్ మోడల్లో ఉండేలా చూడాలని ఆయా సంస్థల ప్రతినిధులను కోరాలని అధికారులకు సూచించారు. అమరావతికి వరల్డ్ క్లాస్ సిటీ లుక్ రావాలంటే హైరెయిజ్ బిల్డింగులు ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, సీఆర్డీఏ, ఏడీసీఎల్, ఫైనాన్స్ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, వివిధ కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story