ఆ అవకాశం ఉంది.. సిద్దంగా ఉండండి.. క్యాడర్, లీడర్లను అలర్ట్ చేసిన చంద్రబాబు
Chandrababu Review Meeting On Badude Badudu. కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలకు టీడీపీ ఇప్పుడు ఒక హోప్ గా కనిపిస్తుందని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు
By Medi Samrat
కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలకు టీడీపీ ఇప్పుడు ఒక హోప్ గా కనిపిస్తుందని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. బాదుడే బాదుడు, మెంబర్ షిప్, ఓటర్ వెరిఫికేషన్, మహానాడుపై మంగళవారం సమీక్ష జరిగింది. ఈ మేరకు పార్టీ గ్రామ, మండల కమిటీలతో టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలకు టీడీపీ ఇప్పుడు ఒక హోప్ గా కనిపిస్తుందని.. గ్రామాల్లో టిడిపికి స్వాగతాలు.. గడపగడపలో వైసిపి నేతలకు నిలదీతలు అందుకు నిదర్శనమని అన్నారు. 2024కు ముందుగా ఎన్నికలు వచ్చినా నేతలు సిద్దంగా ఉండాలని నాయకులను అలర్ట్ చేశారు. వైసిపి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ప్రజలు తీవ్ర కష్టాల పాలయ్యారని చంద్రబాబు అన్నారు.
పాలనా వైఫల్యాలు, ప్రభుత్వ నిర్ణయాలతో కష్టాల్లో ఉన్న ప్రజలకు టీడీపీ ఒక హోప్ గా (ఆశ) కనిపిస్తుందని ఆయన అన్నారు. బాదుడే బాదుడు, పార్టీ మెంబర్ షిప్, ఓటర్ వెరిఫికేషన్, మహానాడు నిర్వహణపై చంద్రబాబు గ్రామ, మండల స్థాయి నేతలతో మాట్లాడారు. బాదుడే బాదుడు కార్యక్రమం జరుగుతున్న తీరుపై సమీక్ష చేశారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో గ్రామ స్థాయి వరకు ఎక్కడా నిర్లక్ష్యం చెయ్యకుండా ఇంటింటికీ వెళ్లాలని నేతలకు సూచించారు. టిడిపి శ్రేణులు, నేతలు గ్రామాల్లో ఇళ్ల కు వెళుతుంటే.. ప్రజలు ఎదురొచ్చి తమ కష్టాలు చెప్పుకుంటున్నారని అన్నారు.
ఇదే సందర్భంలో వైసిపి నేతలు గడప గడపకు కార్యక్రమంలో ప్రజల వద్దకు వెళుతుంటే సమస్యలపై గట్టిగా నిలదీస్తున్నారని గుర్తుచేశారు. ప్రజల్లో ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకతకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ అని చంద్రబాబు అన్నారు. ప్రజల భవిష్యత్ కు టీడీపీ భరోసాగా కనిపిస్తుందని చంద్రబాబు అన్నారు. తన పర్యటనల్లో వస్తున్న స్పందనను కూడా నేతలతో చంద్రబాబు పంచుకున్నారు. నాయకులు అనే వారు నిత్యం ప్రజలకు దగ్గరగా ఉండాలని సూచించారు.
జగన్ ప్రభుత్వ పై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని.. అన్ని వర్గాలలో, అన్ని ప్రాంతాలలో అది స్పష్టంగా కనిపిస్తుందని.. టిడిపికి ఇదొక మంచి చిహ్నం అని చంద్రబాబు అన్నారు. 2024 కంటే ముందుగా ఎన్నికలు వచ్చినా వచ్చే అవకాశం ఉందని.. క్యాడర్, లీడర్స్ అన్నింటికి సిద్దపడి ఉండాలని అన్నారు.