యువగళం ముగింపు సభకు చంద్రబాబు, పవన్ కల్యాణ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర డిసెంబరు 17తో ముగియనుంది.
By Medi Samrat
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర డిసెంబరు 17తో ముగియనుంది. భీమిలి నియోజకవర్గంలో యువగళం ముగింపు సభను భారీ ఎత్తున నిర్వహించనున్నారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారని టీడీపీ విశాఖ పార్లమెంటు స్థానం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. యువగళం పాదయాత్ర డిసెంబరు 6న అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేటకు చేరుకుంటుందని, పాయకరావుపేటలో 7న మొదలయ్యే యువగళం డిసెంబరు 17తో సమాప్తం అవుతుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. నారా లోకేశ్ జనవరి 27న కుప్పంలో యువగళం పాదయాత్రను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే!! 4 వేల కిలోమీటర్లు, 400 రోజుల పాటు పాదయాత్ర సాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ అవ్వడంతో నారా లోకేష్ యువగళానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇటీవలే లోకేశ్ యువగళాన్ని పునఃప్రారంభించారు.
పిఠాపురం ఉప్పాడ సెంటర్లో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర బహిరంగ సభ రద్దు అయింది. గొంతు నొప్పి తీవ్రంగా ఉండడంతో లోకేష్ బహిరంగ సభను రద్దు చేశారు. ఆదివారం నాడు ఉప్పాడ కొత్తపల్లి సెంటర్లో లోకేష్ ప్రసంగించనున్నారు. కాకినాడ సభలో గొంతునొప్పితో ప్రసంగించేందుకు లోకేష్ తీవ్ర ఇబ్బంది పడ్డ సంగతి తెలిసిందే.