ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన అడుగు వేసింది. ‘ది ఆంధ్రప్రదేశ్ రీ ఆర్గనైజేషన్ (అమెండ్మెంట్) బిల్, 2026’ పేరుతో రూపొందించిన సవరణ బిల్లును కేంద్రం బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. లోక్సభ రేపటి బిజినెస్ లిస్టులో ఈ బిల్లును ఇప్పటికే చేర్చారు.
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ ఈనెల 28న రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపిన నేపథ్యంలో, కేంద్రం ఈ బిల్లును యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకెళ్తోంది. విభజన చట్టంలోని కొన్ని నిబంధనలను సవరించడం ద్వారా అమరావతికి రాజ్యాంగబద్ధమైన రక్షణ కల్పించడంతో పాటు, భవిష్యత్తులో రాజధాని మార్పునకు సంబంధించి ఎటువంటి వివాదాలకు తావు లేకుండా కేంద్రం ఈ చర్యలు చేపట్టింది.
ఈ బిల్లుకు లోక్సభ రేపే ఆమోదం తెలిపే అవకాశం ఉందని సమాచారం. తద్వారా అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధుల మంజూరు, కేంద్ర సంస్థల ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రానికి మరింత వెసులుబాటు కలగనుంది. గత కొన్నేళ్లుగా రాజధాని విషయంలో నెలకొన్న అనిశ్చితికి ఈ బిల్లుతో తెరపడనుండటంతో ఏపీ రాజకీయాల్లో ఇది చారిత్రాత్మక ఘట్టంగా నిలవనుంది.