అమరావతి నిర్మాణంలో ముందడుగు..2 ప్రాజెక్టులకు కేంద్రం పచ్చజెండా

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగుపడింది.

By Knakam Karthik
Published on : 18 Jun 2025 11:10 AM IST

Andhrapradesh, Amaravati, Central Government, Amaravati Project

అమరావతి నిర్మాణంలో ముందడుగు..2 ప్రాజెక్టులకు కేంద్రం పచ్చజెండా

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగుపడింది. అమరావతిలో మొత్తం రూ.2,787 కోట్లతో రెండు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. అమరావతిలో ఉమ్మడి కేంద్ర సచివాలయానికి రూ.1458 కోట్లు, ఉద్యోగుల నివాస సముదాయానికి రూ.1329 కోట్లను కేంద్ర ప్రభుత్వం వెచ్చించనుంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ చేసిన ప్రతిపాదనలకు ఆర్థికశాఖ ఆమోదముద్ర వేసింది.

రెండు ప్రాజెక్టులనూ కేంద్ర ప్రజాపనుల విభాగం చేపట్టనుంది. ఉమ్మడి కేంద్ర సచివాలయ నిర్మాణం కోసం 2018లోనే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 22 ఎకరాల 53 సెంట్లు కేటాయించింది. అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ ఏజీసీ పరిధిలో 5.53 ఎకరాలు, దానికి వెలుపల 17 ఎకరాలు ఇచ్చింది.

గతంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలకు రాజధానిలో విడిడిగా స్థలాలు కేటాయించారు. కానీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాటిని రద్దు చేసి కేంద్ర ప్రభుత్వ విభాగాల కార్యాలయాలన్నింటినీ ఒకే ప్రాంగణంలోకి తెచ్చేలా మళ్లీ భూములు కేటాయించింది. ఈ ఏడాది మార్చిలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ను కలసి ఉమ్మడి కేంద్ర సెక్రటేరియేట్‌ నిర్మాణం చేపట్టాలని కోరారు.

Next Story