విషప్రచారం మానుకోకపోతే.. పరువునష్టం దావా వేస్తా..
Balineni Srinivasareddy Fire On Fake News. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నట్టు ఓ పత్రికలో వచ్చిన కథనంపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 9 April 2022 3:01 PM IST
తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నట్టు ఓ పత్రికలో వచ్చిన కథనంపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు పార్టీ ముఖ్యం.. మంత్రి పదవి కాదని నేను ఎప్పుడో చెప్పానని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మరోమారు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో శనివారం బాలినేని మీడియాతో మాట్లాడుతూ.. ''రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత.. నాలుగేళ్ల ముందే మంత్రి పదవి వదులుకొని జగన్ పక్కన నిలబడ్డాను. సీఎం వైయస్ జగన్కు నేను వీరాభిమానిని. కేబినెట్ మొత్తాన్ని తొలగిస్తున్నా అని సీఎం జగన్ అన్నప్పుడే.. నా పూర్తి మద్దతును బహిరంగంగా ప్రకటించాను. నాకు పార్టీ ముఖ్యం.. మంత్రి పదవి కాదని నేను ఎప్పుడో చెప్పాను. ఆంధ్రజ్యోతి రాతలు మరింత నీచంగా ఉన్నాయి. ఇప్పటికైనా ఆంధ్రజ్యోతి విషప్రచారం మానుకోకపోతే ఆ పత్రికపై పరువునష్టం దావా వేస్తా''నని హెచ్చరించారు.
మరోవైపు.. విజయవాడలో సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. రాజీనామాల తర్వాత అసంతృప్తి అనేది అవాస్తవం. మంత్రులందరం సీఎం వైయస్ జగన్ నిర్ణయాన్ని గౌరవించి ఏకాభిప్రాయంతోనే రాజీనామా చేశాం. కొన్ని మీడియా సంస్థలు ప్రజలని తప్పుదోవ పట్టించేలా అసంతృప్తులంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కేబినెట్ కూర్పుపై స్వేచ్చగా నిర్ణయం తీసుకునే అధికారం సీఎం జగన్కు ఉంది. ముఖ్యమంత్రి నిర్ణయాలకు అనుగుణంగానే అందరూ పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సీఎం జగన్ పనితీరుని చూసే ప్రజలు ఓట్లేస్తారు.. మమ్మల్ని చూసి కాదు. మా అందరికీ ముఖ్యమంత్రి జగన్పై అపార నమ్మకం, అచంఛల విశ్వాసం ఉందని అన్నారు. బలహీనవర్గాలలో ఇంతమందికి గతంలో ఎవరూ అవకాశం కల్పించలేదు. సామాన్య కుటుంబంలో పుట్టిన నాకు ఎమ్మెల్యేగా, మంత్రిగా సీఎం జగన్ నాకు గొప్ప అవకాశం ఇచ్చారు. సీఎం జగన్ దగ్గర పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా మేమంతా సంతోషంగా పనిచేస్తామని తెలిపారు.