సీఎం చంద్రబాబును కొనియాడిన బాబా రామ్దేవ్
దేశంలో చంద్రబాబు కంటే దార్శనికత కలిగిన నేత.. ప్రజాహితం కోరే నాయకుడు ఎవరూ లేరని ప్రముఖ యోగాగురు బాబా రామ్ దేవ్ వ్యాఖ్యానించారు.
By Medi Samrat
దేశంలో చంద్రబాబు కంటే దార్శనికత కలిగిన నేత.. ప్రజాహితం కోరే నాయకుడు ఎవరూ లేరని ప్రముఖ యోగాగురు బాబా రామ్ దేవ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం విజయవాడలోని మురళీ ఫార్చూన్ హోటల్ లో జరిగిన గ్లోబల్ ఫర్ సస్టెయినబుల్ ట్రాన్సఫర్మేషన్ (జీఎప్ఎస్టీ) టూరిజం కాన్క్లేవ్కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రియేటివిటీ, ప్రొడక్టివిటీ, ప్రొఫషనలిజం, ఎఫీషియన్సీ లాంటి అంశాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అని కొనియాడారు. చంద్రబాబు తెలుగు ప్రజలకు దేవుడు పంపిన వరం అంటూ బాబా రామ్ దేవ్ ప్రశంసించారు. ప్రజల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన చేసినంత విజన్ మరెవరూ చేయటం లేదన్నారు. అందరికంటే వేగంగా, ముందుగానే ఆలోచిస్తూ చంద్రబాబు తన బయోలాజికల్ వయస్సును రివర్స్ చేశారని అన్నారు. పారిస్ , స్విట్జర్లాండ్, టర్కీ లాంటి దేశాలకు పర్యాటకం కోసం వెళ్తున్న ప్రజలు ఏపీలో ఉన్న పర్యాటక ప్రాంతాలను కూడా గుర్తించాలన్నారు. ఏపీ పర్యాటక రంగాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని రామ్ దేవ్ అన్నారు.
పతంజలి సంస్థ హార్సిలీ హిల్స్లో ప్రపంచ ప్రమాణాలతో వెల్ నెస్ సెంటర్ను ఏర్పాటు చేయనుందని వెల్లడించారు. అలాగే దిండి లాంటి ప్రాంతాల్లో వెడ్డింగ్ క్రూయిజ్ బోట్ లాంటి ప్రాజెక్టు చేపట్టేందుకు ఆసక్తి కనపరుస్తోందన్నారు. భారతీయ సంప్రదాయ వివాహాలు అక్కడ జరిపించేలా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్రాజెక్టు చేపడతామని అన్నారు. ప్రభుత్వం అనుమతిస్తే ఏపీ పర్యాటకానికి తాను ప్రచారం చేస్తానని వెల్లడించారు. కార్యక్రమం అనంతరం హరిద్వార్ నుంచి తెచ్చిన పవిత్ర గంగా జలాన్ని సీఎం చంద్రబాబుకు బాబారామ్ దేవ్ అందజేశారు.
జీఎఫ్ఎస్టీ టూరిజం కాన్క్లేవ్లో భాగంగా వివిధ పర్యాటక ప్రాజెక్టుల ఒప్పందాలు సీఎం చంద్రబాబు సమక్షంలో జరిగాయి. 82 ప్రాజెక్టులకు సంబంధించి రూ.10,329 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థతో ఆయా సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. అనంతరం టూరిజం బ్రోచర్, కాఫీ టేబుల్ బుక్, పర్యాటక ఈవెంట్ల కేలండర్ను బాబా రామ్ దేవ్తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారు. అంతకుముందు హోటల్ గదులుగా తీర్చిదిద్దిన టూరిజం క్యారవాన్లను సీఎం జెండా ఊపి ప్రారంభించారు.