'అమరావతిపై నాడు మట్టి కొట్టారు.. నేడు సున్నం కొట్టారు'.. ప్రధాని మోదీపై షర్మిల ఫైర్‌

ఏపీ విభజన చట్టం ప్రకారం నూతన రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్రానిదే అయినా ప్రధాని మోదీ పట్టించుకోవట్లేదని ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల ఫైర్‌ అయ్యారు.

By అంజి
Published on : 3 May 2025 11:49 AM IST

APCC chief, YS Sharmila, Prime Minister Modi, Amaravati, APnews

'అమరావతిపై నాడు మట్టి కొట్టారు.. నేడు సున్నం కొట్టారు'.. ప్రధాని మోదీపై షర్మిల ఫైర్‌

ఏపీ విభజన చట్టం ప్రకారం నూతన రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్రానిదే అయినా ప్రధాని మోదీ పట్టించుకోవట్లేదని ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల ఫైర్‌ అయ్యారు. 2015లో మట్టి కొట్టారని, నేడు సున్నం కొట్టి వెళ్లారని దుయ్యబట్టారు. 'అమరావతి నిర్మాణానికి ఖర్చయ్యే రూ.లక్ష కోట్లలో ఒక్క రూపాయి అయినా మోదీ ప్రకటించారా? రాజధానికి చట్టబద్ధత కల్పించారా? చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మోదీని నమ్మి మోసపోతున్నట్టు తెలుసుకోవాలి' అని వైఎస్‌ షర్మిల ఎక్స్‌లో రాసుకొచ్చారు.

''ఆంధ్రప్రదేశ్ పునర్విభన చట్టం 94(3) సెక్షన్ ప్రకారం నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే. నూతన రాజధానిలో మౌలిక సదుపాయాలు కల్పన కేంద్రం కల్పించి ఇవ్వాల్సిందే. విభజన చట్టంలో కేంద్రం విధులేంటో ఇంత స్పష్టంగా పేర్కొంటే.. మరి ప్రధాని మోదీ మనకు ఇస్తున్నది ఏమిటి ? ఆనాడు 2015లో మట్టి కొట్టారు. నేడు సున్నం కొట్టి వెళ్ళారు. 10 ఏళ్ల క్రితం ఏం చెప్పి ఆంధ్రులకు తీరని ద్రోహం చేశారో.. నేడు అవే అబద్ధాలను అందంగా చెప్పి ఘరానా మోసం చేశారు'' అని పేర్కొన్నారు.

'మళ్ళీ "అభివృద్ధి చేస్తాం, భుజాలు కలుపుతాం" అంటూ బూటకపు మాటలు చెప్పారు. 5 కోట్ల మంది కలల సౌధం అమరావతికి 2015 నుండి అన్ని చేశామని పచ్చి అబద్ధాలు చెప్పారు. అన్ని ఇస్తే మాకు రాజధాని నిర్మాణం ఇంతవరకు ఎందుకు కాలేదు ? అమరావతి నిర్మాణానికి ఖర్చయ్యే లక్ష కోట్లలో ఒక్క రూపాయి అయినా ప్రకటించారా ? రాజధాని నిర్మాణం కేంద్రం బాధ్యత అని హామీ ఇచ్చారా ? కనీసం అమరావతికి చట్టబద్ధత ఇస్తున్నామని చెప్పారా? పోనీ విభజన హామీలపై టైమ్ బాండ్ క్లారిటీ ఇచ్చారా ? చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మోడీని నమ్మి మళ్ళీ మళ్ళీ మోసపోతున్నట్లు తెలుసుకోవాలి. ఏదో ఉద్ధరిస్తారని, కాసులు కురిపిస్తారని నమ్మి ఒకసారి రాత్రి గోతిలో పడ్డ చంద్రబాబు.. మళ్ళీ మోడీని పిలిచి అదే గోతిలో పగలు పడ్డారు' అని షర్మిల దుయ్యబట్టారు.

''ముఖ్యమంత్రి చంద్రబాబుని కాంగ్రెస్ పార్టీ పక్షాన సూటిగా ప్రశ్నిస్తున్నాం. రాజధానికి కావాల్సింది అప్పులు కాదు.. నిధులు. రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని, అప్పు పుట్టనిదే జీతాలకు దిక్కులేదని చెప్పే మీరు రాజధాని నిర్మాణానికి ఎవరిని అడిగి రూ.60 వేల కోట్లు అప్పు తెస్తున్నారు ? వడ్డీల భారం మోసేదెలా? వరల్డ్ బ్యాంక్, ADB, KFW, హడ్కోల దగ్గర రాష్ట్రాన్ని ఎందుకు తాకట్టు పెడుతున్నారు ? ప్రభుత్వ భూములు అంటే ప్రజల ఆస్తి వాటిని అమ్మి రాజధాని ఎలా కడతారు ? కేంద్రం మెడలు వంచే దమ్ములేక భావితరాల మీద అప్పు భారం ఎందుకు మోపుతున్నారో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి'' అని షర్మిల ప్రశ్నించారు.

Next Story