జంగారెడ్డిగూడెం మరణాలపై దుష్ప్రచారం చేస్తున్నారు : టీడీపీపై మంత్రులు ఫైర్‌

AP Ministers Fire On TDP Leaders. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో అయిదవ రోజు, సభ ప్రారంభంతోనే టీడీపీ నినాదాలు చేస్తూ

By Medi Samrat  Published on  14 March 2022 6:02 AM GMT
జంగారెడ్డిగూడెం మరణాలపై దుష్ప్రచారం చేస్తున్నారు : టీడీపీపై మంత్రులు ఫైర్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో అయిదవ రోజు, సభ ప్రారంభంతోనే టీడీపీ నినాదాలు చేస్తూ, వాయిదా తీర్మానంపై చర్చకు డిమాండ్‌ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా, జంగారెడ్డిగూడెంలో నాటుసారాకు 18 మంది బలయ్యారని ఆరోపిస్తూ.. చర్చకు పట్టుబట్టి సభా కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్పీకర్‌ పోడియంను కూడా చుట్టుముట్టడంతో సభను స్పీకర్‌ కాసేపు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా టీడీపీ సభ్యులు అదే విధంగా వ్యవహరిస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో ప్రశ్నోత్తరాలకు మళ్లీ అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా మంత్రులు కొడాలి నాని, కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడారు.

కొడాలి నాని మాట్లాడుతూ.. నాడు ఎన్టీఆర్‌ మద్య నిషేధం అమలు చేస్తే, దానికి తూట్లు పొడిచిన చంద్రబాబు, తన పాలనలో ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు పెంచారని విమ‌ర్శించారు. ఎక్కడ పడితే అక్కడ బెల్ట్‌షాప్‌లు ఏర్పాటు చేయించి, మద్యం అమ్మకాలు పెంచి, అంతులేని అవినీతికి పాల్పడ్డాడని ఫైర్ అయ్యారు. ఇవాళ కూడా ఎల్లో మీడియా.. జంగారెడ్డిగూడెం ఘటనను తప్పు పట్టిస్తూ.. ప్రజల్లో అపోహలు కల్పించే విధంగా కథ‌నాలు రాశాయ‌ని.. చంద్రబాబు శవ రాజకీయం చేస్తున్నార‌ని.. ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేయాలని మంత్రి నాని అన్నారు.

కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. శవ రాజకీయాలకు టీడీపీ పేటెంట్‌గా మారింద‌ని ఆరోపించారు. ఎక్కడా, ఏదీ వదలకుండా శవాలు పట్టుకుని రాజకీయం చేయడం ఆ పార్టీకి అలవాటుగా మారిందని విమ‌ర్శించారు. ప్రభుత్వాన్ని దుర్మార్గంగా కించపర్చాలని కుట్ర చేస్తున్నారని.. ఇంటింటికీ బెల్ట్‌ షాప్‌లు, పర్మిట్‌ రూమ్‌లు పెట్టి ఆనాడు దారుణంగా మద్యం అమ్మకాలు కొనసాగించారని అన్నారు. నాడు ఎన్టీఆర్‌ మద్య నిషేధం అమలు చేస్తే, అధికారంలోకి రాగానే మద్యం కంపెనీలతో కుమ్మక్కై మద్య నిషేధానికి తూట్లు పొడిచారని.. ఇవాళ కూడా సిగ్గు, శరం లేకుండా వ్యవహరిస్తున్నారని తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు.













Next Story