సింగపూర్ టూర్..యువతకు గుడ్‌న్యూస్, జగన్‌కు బ్యాడ్ న్యూస్: మంత్రి లోకేశ్

రాష్ట్రంలో యువతకు గుడ్ న్యూస్, జగన్ కు బ్యాడ్ న్యూస్ అని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.

By Knakam Karthik
Published on : 1 Aug 2025 12:31 PM IST

Andrapradesh, Minister Nara Lokesh, Cm Chandrababu,  Singapore Tour, ysrcp, Jagan

సింగపూర్ టూర్..యువతకు గుడ్‌న్యూస్, జగన్‌కు బ్యాడ్ న్యూస్: మంత్రి లోకేశ్

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో 4 రోజులపాటు విజయవంతంగా సింగపూర్ లో పర్యటన పూర్తిచేశాం, రాబోయే అయిదేళ్లలో గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఇన్వెస్టిమెంట్ కార్పొరేషన్ (జిఐసి) సింగపూర్ సావరిన్ ఫండ్ ద్వారా ఏపీలో 45వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాం, ఇది రాష్ట్రంలో యువతకు గుడ్ న్యూస్, జగన్ కు బ్యాడ్ న్యూస్ అని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఉండవల్లి నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్రానికి పెట్టుబడుల సాధన, బ్రాండ్ ఇమేజ్ ను పెంచడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో 4రోజుల పాటు నిర్వహించిన సింగపూర్ టూర్ విశేషాలను ఆయన వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... 1995 నుంచి సింగపూర్ తో చంద్రబాబుగారికి అనుబంధం ఉంది. సింగపూర్ లో మాకు తెలుగువారు ఘనస్వాగతం పలికారు, సింగపూర్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా 2 వేలమంది తెలుగువారు వచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం పలు కంపెనీల నుంచి కమిట్ మెంట్స్ తీసుకున్నాం, రాబోయే రోజుల్లో పెద్దఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నేరపూరిత రాజకీయాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఉదయం 8 నుంచి రాత్రి 11.30వరకు రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. సిఎంతో పాటే మేం కూడా పోటీపడి పనిచేస్తున్నాం.

అధికారంలో ఉన్నా, లేకపోయినా చంద్రబాబుని అక్కడి ప్రభుత్వం గౌరవిస్తూ వస్తుంది. సీఎం నేతృత్వంలో నారాయణ, టిజి భరత్ నేను, అయిదుగురు ఐఏఎస్‌లు సింగపూర్ వెళ్లాం. రికార్డులను సరిచేయడానికే వెళ్లాం. గతంలో వారితో మాట్లాడకుండా ఏకపక్షంగా ఒప్పందాలు రద్దుచేసి సింగపూర్ కంపెనీలను తరిమేశారు. ప్రపంచవ్యాప్తంగా పారదర్శకతలో టాప్ – 5లో సింగపూర్ ఉంటుంది. అలాంటి దేశంపై అవినీతి ముద్రవేసేందుకు ప్రయత్నించారు. దీనివల్ల భారతదేశం కూడా నష్టపోయింది. మన రిప్యూటేషన్ పోయింది. సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ ధర్మన్ షణ్ముగ రత్నం, మంత్రి టాన్ సీలింగ్ తో సహా అక్కడ ప్రభుత్వ పెద్దలందరితో చర్చలు జరిపాం. నాలుగురోజుల్లో ముఖ్యమంత్రి 26 ముఖాముఖి సమావేశాల్లో పాల్గొన్నారు. నేను 19 పారిశ్రామికవేత్తలతో చర్చలతో సహా 35 కార్యక్రమాలకు హాజరయ్యాను. టువాస్ పోర్టు, జురాంగ్ పెట్రో కెమికల్స్, ఐటి, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, స్పోర్ట్స్ రియల్ ఎస్టేట్ కంపెనీలతో చర్చించాం.

మురళీకృష్ణ అనే వ్యక్తి సింగపూర్ ప్రభుత్వానికి మంత్రులు, అధికారులు, హైకమీషనర్ కు రాష్ట్రంలో అస్థిరమైన ప్రభుత్వం ఉందని, పెట్టుబడులు పెట్టొద్దని ఈ - మెయిల్ పంపారు. మేం ఆరా తీస్తే ఆ వ్యక్తి పెద్దిరెడ్డికి చెందిన పిఎల్ఆర్ కంపెనీతో, వైసిపి నేతలతో తరచూ మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకునేందుకే ఇటువంటి కుట్రలకు తెరలేపారు. టిసిఎస్ కు 99 పైసలకే భూములిస్తే కోర్టులో కేసులు వేశారు. అయితే వారికి కోర్టు అక్షింతలు వేసింది. అడుగడుగునా అభివృద్ధిని, పెట్టుబడులను అడ్డుకోవడానికి కుట్రలు పన్నుతున్నారు. చెన్నయ్ లో ఒక కంపెనీకి ఇబ్బంది వస్తే రాజకీయాలకు అతీతంగా అక్కడ రాజకీయా పక్షాలన్నీ సింగపూర్ హైకమిషనర్ వద్దకు వెళ్లారు. రాజకీయ పోరాటం చెన్నయ్ వరకే, బయటకు వచ్చాక మేమంతా తమిళనాడు వాళ్లం, రాష్ట్రం కోసం కలసికట్టుగా ప్రయత్నిస్తామని వారు చెప్పారు. మన రాష్ట్రంలో రాష్ట్రాభివృద్ధి కోసం బాండ్స్ విడుదల చేస్తే ఆర్ బిఐ నుంచి అందరికీ ఈ-మెయిల్ ద్వారా తప్పుడు ఫిర్యాదులు చేశారు. ఇటువంటి వారివల్లే ఏపీ బ్రాండ్ పడిపోతుంది. ఆ మెయిల్స్ చదువుతుంటే చాలా బాధేస్తుంది. చంద్రబాబు పేరు చెప్పి మేం కంపెనీలను రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నాం. యుఏఈ మంత్రి ఇటీవల భారత్ పర్యటనలో విజయవాడ వచ్చాకే పక్క రాష్ట్రానికి వెళ్లారు. వైసీపీ వారు మాత్రం అడ్డంకులు సృష్టిస్తున్నారు. వైసీపీ నాయకుల చర్యల వల్ల ఏపీతో పాటు ఆ దేశంలో ఉన్న తెలుగువారు నష్టపోతున్నారు..అని లోకేశ్ పేర్కొన్నారు.

Next Story