పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
పరకామణి చోరీ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది
By - Knakam Karthik |
పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరకామణి చోరీ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరైన టీటీడీ మాజీ సీవీఎస్వో సతీశ్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం... కేసులోని నిందితులు, సాక్షుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో, కేసులో ప్రధాన నిందితుడు రవికుమార్తో పాటు అన్ని సాక్ష్యులకు కూడా భద్రతను కల్పించాలని కోర్టు స్పష్టమైన నిర్దేశాలు ఇచ్చింది. పరకామణి చోరీ కేసు పూర్తిగా ముగిసే వరకు సాక్ష్యులకు రక్షణ అందించే బాధ్యత ఏపీ సీఐడీ డీజీదేనని హైకోర్టు ఆదేశించింది. కేసు విచారణ ముగిసేంత వరకు వారికి ఎలాంటి హాని కలగకుండా రక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. విచారణ సమయంలో అనవసర ఇబ్బందులు తలెత్తకుండా, సాక్షుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. అదే సమయంలో, ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను డిసెంబర్ 2కి మార్చింది.
పరకామణి చోరీ కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే కొన్ని రోజుల క్రితం సతీశ్ కుమార్ మరణించడం తీవ్ర కలకలం రేపింది. మొదట అనుమానాస్పద మృతిగా నమోదైన ఈ కేసును, ఆ తర్వాత హత్య కేసుగా మార్చిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో సాక్షుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.