ఇప్పటం గ్రామస్తులకు మరోసారి చుక్కెదురు

AP High Court Dismissed Ippatam Villagers Pitition. ఇప్పటం గ్రామంలో ఇటీవల ప్రభుత్వం పలు నిర్మాణాలను కూల్చివేసింది.

By Medi Samrat  Published on  14 Dec 2022 3:45 PM GMT
ఇప్పటం గ్రామస్తులకు మరోసారి చుక్కెదురు

ఇప్పటం గ్రామంలో ఇటీవల ప్రభుత్వం పలు నిర్మాణాలను కూల్చివేసింది. దీనిపై ఇప్పటం గ్రామస్తులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, స్టే లభించింది. తాము నోటీసులు ఇచ్చిన తర్వాతే కూల్చివేతలు చేపట్టామన్న విషయాన్ని ప్రభుత్వం ఆధారాలతో సహా హైకోర్టులో నిరూపించింది. దీంతో నోటీసుల విషయం దాచిపెట్టి స్టే పొందారంటూ హైకోర్టు, 14 మందికి రూ.1 లక్ష చొప్పున జరిమానా విధించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఈ తీర్పును ఇప్పటం గ్రామస్తులు హైకోర్టు డివిజన్ బెంచ్ వద్ద సవాల్ చేశారు. సింగిల్ బెంచ్ తీర్పును సమీక్షించాలంటూ రిట్ పిటిషన్ వేశారు.

అయితే, ఇప్పటం గ్రామస్తులకు మరోసారి చుక్కెదురైంది. డివిజన్ బెంచ్ కూడా వారికి వ్యతిరేకంగానే తీర్పు వెలువరించింది. వారు దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టిపారేసింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపిస్తూ, పిటిషనర్లు చిన్న రైతులు అని, పెద్ద జరిమానా చెల్లించలేరని పేర్కొనగా, పిటిషనర్లపై దయచూపితే ఇటువంటి చర్యలను ప్రోత్సహించినట్టు అవుతుందని న్యాయస్థానం తెలిపింది.

ఇప్పటం గ్రామంలో ప్రభుత్వ కూల్చివేతలపై నోటీస్ ఇవ్వకుండా కూల్చారంటూ.. ఇప్పటం గ్రామస్తులు ఇదివరకు కోర్టు మెట్లెక్కారు. తాము నోటీసులు ఇచ్చే కూల్చివేతలు చేపట్టామని ప్రభుత్వం చెప్పడంతో.. ఆ కేసుకు సంబంధించి 14 మంది పిటిషనర్లకు రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తూ సింగిల్ బెంచ్ జడ్జి తీర్పు ఇచ్చారు. ఇప్పుడు ఈ తీర్పుపై రిట్ పిటిషన్ పైనా గ్రామస్థులకు చుక్కెదురైంది.


Next Story