Manipur Violence: మణిపూర్‌లో అల్లర్లు.. ఏపీ విద్యార్థుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నంబర్లు

హింసాత్మక మణిపూర్‌లో చిక్కుకున్న విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం అత్యవసర హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది.

By అంజి  Published on  7 May 2023 3:31 AM GMT
AP Govt, Students, Manipur, National news

Manipur Violence: మణిపూర్‌లో అల్లర్లు.. ఏపీ విద్యార్థుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నంబర్లు

అమరావతి: హింసాత్మక మణిపూర్‌లో చిక్కుకున్న విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం అత్యవసర హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. రెస్క్యూ ఆపరేషన్ కోసం మైఖేల్ అంకుమ్‌ను స్పెషల్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ (OSD)గా ప్రభుత్వం నియమించింది. న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో 24 గంటలపాటు కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. గత కొన్ని రోజులుగా హింసాత్మక ఘర్షణలను చూస్తున్న కొండ రాష్ట్రం నుండి తెలుగు విద్యార్థులను సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ అధికారులు మణిపూర్ పోలీసులతో సమన్వయం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దాదాపు 150 మంది విద్యార్థులు ఈశాన్య రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలలో చేరారు. ఒంటరిగా ఉన్న విద్యార్థులు ఈ ఏపీ హెల్ప్‌లైన్ నంబర్‌లు 011-23384016, 011-23387089కు కాల్ చేసి మద్దతు పొందవచ్చు. అదనంగా 8399882392 , 9436034077, 7085517602 ఈ నంబర్లకు కూడా కాల్‌ చేసి మణిపూర్ అధికారులను సంప్రదించవచ్చు. తాజా నివేదికల ప్రకారం.. మే 3 నుండి మణిపూర్ హింసాకాండలో కనీసం 20 మంది చనిపోయారు. అయితే, ధృవీకరించని నివేదికల ప్రకారం 50 నుండి 55 మంది మరణించారు. హింస ఎడతెగకుండా కొనసాగుతుండటంతో, రాష్ట్ర రాజధానిలో కేంద్రం సైన్యాన్ని మోహరించింది.

మరోవైపు హింసాత్మక మణిపూర్‌లో చిక్కుకుపోయిన విద్యార్థులు, పౌరులను తరలించడానికి తెలంగాణ ప్రభుత్వం ఇంఫాల్‌కు ప్రత్యేక విమానాన్ని పంపుతుందని రాష్ట్ర పోలీసు చీఫ్ శనివారం తెలిపారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్ ప్రకారం.. విమానం మే 7 ఉదయం ఇంఫాల్ చేరుకోవడానికి షెడ్యూల్ చేయబడింది. డిజిపి కార్యాలయంలోని ప్రత్యేక హెల్ప్‌లైన్ సెల్ తరలింపును సమన్వయం చేస్తోంది. మణిపూర్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ పౌరుల కోసం అత్యవసర హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ ఇదివరకే ప్రకటించారు.

తెలంగాణ పోలీసులు మణిపూర్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పారు. పౌరులు సహాయం కోసం తెలంగాణ హెల్ప్‌లైన్ నంబర్ 7901643283. డీఐజీ సుమతిని సంప్రదించవచ్చు. ఫోన్ లైన్‌లు 24 గంటలూ తెరిచి ఉంటాయి. పౌరులు dgp@tspolice.gov.inకి కూడా ఇమెయిల్ చేయవచ్చు .

Next Story