ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలోని స్టేట్ డేటా సెంటర్ (APSDC) కు మద్దతుగా తిరుపతిలో డిజాస్టర్ రికవరీ (DR) సెంటర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుపతిలోని IIDT క్యాంపస్లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీని కోసం ప్రభుత్వం ₹195 కోట్లు కేటాయించింది. ఇది 'బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్' (BOOT) పద్ధతిలో పనిచేస్తుంది. దీనికి కేంద్ర ప్రభుత్వ 'SASCI' నిధులు మద్దతుగా ఉంటాయి.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ డేటా అంతా మంగళగిరిలోని పై (Pi) డేటా సెంటర్లో ఉంది. ప్రకృతి వైపరీత్యాలు లేదా సాంకేతిక విపత్తులు సంభవించినప్పుడు డేటా భద్రత కోసం భౌగోళికంగా దూరంగా ఉండే మరో కేంద్రం (DR Site) అవసరమని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ శాఖల అప్లికేషన్లు, వెబ్ పోర్టళ్లు మరియు పౌర సేవలకు సంబంధించిన డేటా ఇక్కడ సురక్షితంగా నిక్షిప్తమై ఉంటుంది. ఐదేళ్ల పాటు దీని నిర్వహణ బాధ్యతలను సంబంధిత సంస్థ చూసుకుంటుంది.