త్యాగ నిరతికి మొహర్రం ప్రతీక
AP Governor Biswabhusan Harichandan. మొహర్రం త్యాగ నిరతికి ప్రతీకగా నిలుస్తోందని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.
By Medi Samrat Published on 19 Aug 2021 9:34 AM GMT
మొహర్రం త్యాగ నిరతికి ప్రతీకగా నిలుస్తోందని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. తన జీవితాన్ని త్యాగం చేసిన పవిత్ర ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ వంటి అమరవీరులను మొహర్రం గుర్తు చేస్తుందన్నారు. మంచితనం, త్యాగం ఇస్లాం సూత్రాలు కాగా మానవతావాదాన్ని వెలువరించే మొహర్రం స్ఫూర్తిని అనుసరించాలన్నారు. కోవిడ్ -19 పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నివాసాలకే పరిమితమై కార్యక్రమాలను జరుపు కోవాలని గవర్నర్ హరిచందన్ సూచించారు.
కోవిడ్ -19 వ్యాక్సిన్ వైరస్ నుండి రక్షణను అందించటం తో పాటు ప్రమాదాన్ని తగ్గిస్తుందని, అర్హులైన వారందరూ వీలైనంత త్వరగా టీకాలు వేయించుకోవాలని విజ్ఞప్తి చేసారు. కరోనా కొత్త వైవిధ్యాలు వెలువడుతున్నందున, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా తగిన ప్రవర్తనను పాటించడం తప్పనిసరన్నారు. టీకాలు తీసుకున్న వారు కూడా కోవిడ్ -19 మార్గదర్శకాలను పాటించాల్సిన అవసరం ఉందని మాననీయ హరిచందన్ తెలిపారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.