పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ ఛైర్మన్ తురకా కిశోర్ను ఏపీ ప్రభుత్వం పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వరుసగా 15 కౌన్సిల్ సమావేశాలకు అతడు గైర్హాజరు కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీ మున్సిపల్ చట్టంలోని సెక్షన్ 16(1)(కె) నిబంధనలను తురకా కిశోర్ ఉల్లంఘించినట్లు నిర్ధారణ కావడంతో అతడిని పదవి నుంచి తప్పిస్తున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తురకా కిశోర్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్ ఈ తొలగింపు ఉత్తర్వులను జారీ చేశారు.
వైసీపీ నేత, కడప మేయర్ సురేశ్బాబుపై ఏపీ ప్రభుత్వం అనర్హత వేటు వేసింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయనను మేయర్ పదవి నుంచి తొలిగించింది. అవినీతి ఆరోపణలతో పాటు ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి రెడ్డిని అవమానించడం, కుటుంబ సభ్యులకు అక్రమంగా కాంట్రాక్టులు కట్టబెట్టడంపై సురేశ్బాబుకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. గతేడాది డిసెంబర్ 23న ఏడుగురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. వారిని సురేశ్బాబు సస్పెండ్ చేయడం కూడా వివాదాస్పదమైంది.