విదేశాల్లో విద్యనభ్యసించాలనుకునే విద్యార్థినులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థినులకు కలలకు రెక్కలు పథకాన్ని అమలుచేసేందుకు విధివిధానాలను సిద్ధం చేయాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
By - Knakam Karthik |
విదేశాల్లో విద్యనభ్యసించాలనుకునే విద్యార్థినులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
అమరావతి: వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థినులకు కలలకు రెక్కలు పథకాన్ని అమలుచేసేందుకు విధివిధానాలను సిద్ధం చేయాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లి నివాసంలో కళాశాల విద్య, ఇంటర్మీడియట్, పాఠశాల విద్యాశాఖ, స్కిల్ డెవలప్ మెంట్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ శుక్రవారం 3 గంటలకు పైగా సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... స్వదేశంతోపాటు విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలన్న ఆసక్తిగల విద్యార్థినులకు కలలకు రెక్కలు పథకం కింద సాయం అందిస్తామని తెలిపారు. ప్రస్తుతం మన రాష్ట్రానికి చెందిన 27,112 మంది విద్యార్థినులు విదేశాల్లో విద్యనభసిస్తున్నారని, స్వదేశంలో 88,196మంది ఉన్నత చదువులు చదువుతున్నట్లు అధికారులు చెప్పారు. విదేశీ విద్య పథకం ఏవిధంగా అమలు చేయాలన్న విషయంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై మంత్రి లోకేష్ ఆందోళన వ్యక్తంచేశారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణ మార్గాలను సూచించేందుకు శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఉమ నేతృత్వంలో అయిదుగురు సభ్యులతో కమిటీని నియమిస్తున్నట్లు చెప్పారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేటు రెసిడెన్షియల్ కళాశాలల్లో సౌకర్యాల మెరుగు, విద్యార్థులపై వత్తిడి తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. అనుమతులు లేకుండా నడిచే ప్రైవేటు కళాశాలలపై చేపట్టాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్ చదివే విద్యార్థులకు ప్రత్యేక తర్ఫీదునిచ్చి ఐఐటి, ఎన్ ఐటి వంటి ప్రతిష్టాత్మక సంస్థల సీట్లు సాధించేలా చూడాలని అన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో పెర్ఫార్మెన్స్ పై దృష్టిసారించాలని సూచించారు.
రాష్ట్రంలో విదేశీ యూనివర్సిటీలు, ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు అనుమతించే విషయమై మంత్రి లోకేష్ అధికారులతో చర్చించారు. ఇటీవల మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా వివిధ యూనివర్సిటీల ప్రతినిధులతో జరిపిన చర్చల పురోగతిపై సమీక్షించారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలతో కొలాబరేషన్ కు ఆస్ట్రేలియాకు చెందిన వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ, జేమ్స్ కుక్ యూనివర్సిటీ, న్యూ క్యాజిల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇంటర్నేషనల్ డిగ్రీలపై దృష్టి సారించాలని మంత్రి లోకేష్ సూచించారు. విశాఖలో ఎడ్యుసిటీ ఏర్పాటు, వరల్డ్ క్లాస్ ఏవియేషన్ యూనివర్సిటీ, అమెరికన్ రైడర్ తరహాలో అంతర్జాతీయస్థాయి ఫ్లయింగ్ స్కూలు, ఎంఆర్ఓ, పైలట్ గ్రౌండ్ హ్యాండిల్, కస్టమర్ సర్వీసులను ఏర్పాటుపై దృష్టిసారించాలని, 50శాతం గ్లోబల్ వర్క్ ఫోర్స్ విశాఖనుంచే సిద్ధం కావాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు మనోభీష్టమని చెప్పారు.