పోలవరంపై సరికొత్త అప్డేట్ ఇచ్చిన ఏపీ సీఎం
AP CM YS Jagan Polawaram Visit. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పోలవరం పర్యటనకు వెళ్లారు.
By Medi Samrat
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పోలవరం పర్యటనకు వెళ్లారు. 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ద్వారా నీరందిస్తామని.. ఆర్థిక పరమైన సమస్యలన్నీ పరిష్కారమవుతాయని చెప్పుకొచ్చారు. పోలవరం ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదని జగన్ స్పష్టం చేశారు. ముందుగా నిర్దేశించుకున్న ప్రకారం ఎఫ్ఆర్ఎల్ లెవల్ 45.72 మీటర్లు ఉంటుందని తెలిపారు. టాప్ ఆఫ్ మెయిన్ డ్యాం లెవల్ 55 మీటర్లు ఉంటుందని సీఎం జగన్ అన్నారు. డ్యామ్తో పాటు అదే వేగంతో పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు. నిర్వాసితులకు న్యాయం చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.
ఈరోజు ఉదయం వైఎస్ జగన్మోహన్రెడ్డి హెలికాఫ్టర్లో సోమవారం పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. పోలవరం పర్యటనలో భాగంగా తొలుత ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్ట్ నిర్మాణ పనులను సీఎం జగన్ పరిశీలించారు. తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. సీఎం జగన్ వెంట మంత్రి అనిల్కుమార్ యాదవ్ ఉన్నారు. స్పిల్వే వద్ద ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని సీఎం జగన్ పరిశీలించారు.
కాఫర్ డ్యాం వద్దకు చేరుకొని, కాఫర్ డ్యాం నిర్మాణ పనులను జగన్ పరిశీలించారు. మే నెలాఖరు నాటికి స్పిల్వే, స్పిల్ ఛానల్ పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గతంలో టీడీపీ కూడా తమ హయాంలో పోలవరంను పూర్తీ చేస్తామని చెప్పింది. కానీ పూర్తీ చేయలేకపోయింది. జగన్ ఇచ్చిన సరికొత్త డేట్ కు పోలవరం ప్రాజెక్టు పూర్తీ అవుతుందో లేదో.. కాలమే నిర్ణయిస్తుంది.