సూపర్ సిక్స్ హామీల అమలుకు కట్టుబడి ఉన్నాం..అని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా మలకపల్లిలో సీఎం పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన ప్రజావేదికలో ఆయన మాట్లాడారు. ప్రతినెలా ఒకటో తేదీన గ్రామాలు కళకళలాడేందుకు పింఛన్లే ప్రధాన కారణం..అని ఆయన చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో జీతాలు, పింఛన్లు సరిగా ఇవ్వలేదు. తాము పేదలను ఆదుకునేందుకు ‘పేదల సేవలో’ కార్యక్రమం చేపట్టామని తెలిపారు.
ఇక పింఛన్ల కోసమే నెలకు రూ.2,750 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చాం. విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తామని చెప్పాం. వైసీపీ హయాంలో జరిగిన విధ్వంసం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. గతంలో వ్యవస్థలన్నీ పడకేశాయి. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. అభివృద్ధి చేస్తాం.. సంపద సృష్టిస్తాం. పెరిగిన ఆదాయాన్ని పేదలకు పంచుతాం.
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే దిశగా వెళ్తున్నాం. సూపర్సిక్స్ పథకాల అమలుకు కట్టుబడి ఉన్నాం. తల్లికి వందనం కింద రూ.10వేల కోట్లు జమ చేశాం. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. విశాఖలో నిర్వహించిన యోగాంధ్రతో 2 గిన్నిస్ రికార్డులు, 21 వరల్డ్ బుక్ రికార్డులు నెలకొల్పాం’’ అని సీఎం చంద్రబాబు తెలిపారు