అవినీతిని సహించేది లేదు, రుజువైతే చర్యలు తప్పవు..సీఎం వార్నింగ్
ఏ శాఖలో, ఎక్కడ, ఎవరు అవినీతికి పాల్పడినా సహించేది లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు
By Knakam Karthik
అవినీతిని సహించేది లేదు, రుజువైతే చర్యలు తప్పవు..సీఎం వార్నింగ్
అమరావతి: ఏ శాఖలో, ఎక్కడ, ఎవరు అవినీతికి పాల్పడినా సహించేది లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. జీరో కరెప్షన్ దిశగా రాష్ట్రంలో పాలనా వ్యవస్థను నిర్మించాలని ఆయన అన్నారు. ఎక్కడ అవినీతి జరుగుతుందో అక్కడ ప్రధానంగా దృష్టి పెట్టి విచారణ జరపాలని... అవినీతి రుజువైతే తక్షణం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏడాది పాలనపై ప్రజల నుంచి... వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై వ్యక్తమైన అభిప్రాయాలపై శనివారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వంపై అత్యధిక స్థాయిలో సంతృప్తి వ్యక్తమైనట్టు ఐవీఆర్ఎస్, సీఎస్డీఎస్ ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడైందని... అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రజాభిప్రాయ సేకరణపై టెక్నికల్ ఆడిటింగ్ జరపాలని... సమస్యలు ఉన్న చోట సంతృప్తి పెంచేలా చూడాలని ముఖ్యమంత్రి అన్నారు. సంక్షేమం, ఉద్యోగాలకల్పన, రహదారులు వంటి 10 ముఖ్యమైన ప్రజా సమస్యలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి...వాటి పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు.
వర్క్ ఫ్రమ్ హోమ్, పెట్టుబడుల రాక, నైపుణ్య శిక్షణతో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో తెలియజేయాలన్నారు. 175 నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు నిర్వహించడంతో పాటు, ఆగస్ట్ 15 కల్లా అన్ని సేవలను వాట్సప్ గవర్నెన్స్ మన మిత్ర కింద అందించాలని స్పష్టం చేశారు. మరోవైపు...వికలాంగులు, వృద్ధులకు రేషన్ సరుకులు ఇంటికి తీసుకువెళ్లి అందించండ మరింత మెరుగ్గా జరిగేలా ఆలోచన చేయాలన్నారు. చౌకధరల దుకాణాలను పెంచడం, నగదు... లేదంటే కూపన్లు ఇవ్వడం వంటి ప్రత్యామ్నాయాలపై లబ్ధిదారుల అభిప్రాయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. అలాగే ఉచిత ఇసుక విధానం అమలులో...ఇసుక లేని చోట్ల సంతృప్తి, ఇసుక ఉన్న చోట అసంతృప్తి ఉండటంపై ప్రాంతాల వారీగా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.