విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌

AP Bandh. ఏపీలో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమం రోజురోజుకు మరింతగా ముదురుతోంది. స్టీల్‌ ప్లాంట్ పరిరక్షణ నినాదంతో శుక్రవారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌

By Medi Samrat  Published on  5 March 2021 2:25 AM GMT
AP Bandh

ఏపీలో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమం రోజురోజుకు మరింతగా ముదురుతోంది. స్టీల్‌ ప్లాంట్ పరిరక్షణ నినాదంతో శుక్రవారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ అమలు కానుంది. ఈ బంద్‌కు రాష్ట్ర సర్కార్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపాలనే నినాదంతో తలపెట్టిన బంద్‌న విజయవంతం చేయాలని, అందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో ఆవిర్భవించిన స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు అన్ని పక్షాలు ఏకతాటిపై ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు.

విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేసేలా ఐక్య కార్యాచరణ చేపట్టనున్నారు. అయితే నష్టాల పేరుతో బడా కార్పొరేట్‌ సంస్థలకు విశాఖ ఉక్కును ధారాదత్తం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. వెంటనే విశాఖ స్టీల్‌ ప్లాట్‌ ప్రైవేటీకరణను ఆపాలని, లేకపోతే పోరాటం ఇంకా ఉధృతం చేస్తామని అన్నారు.


కాగా, గత ఐదు రోజులుగా రాష్ట్రంలో పలు రాజకీయ పార్టీలు, సంఘాలు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను చేపట్టాయి. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బంద్‌ను విజయవంతం చేసి చర్యలు చేపట్టారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరించకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కాకుండా ఉండాలని ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. సీపీఎం, సీపీఐలతోపాటు పలు కార్మిక సంఘాలతో విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, కార్మికులు బంద్‌కు సంఘీభావం ప్రకటించారు.

వర్తక, వ్యాపార సంస్థలతో పాటు విద్యాసంస్థలు, బ్యాంకులు, సినిమా థియేటర్లను స్వచ్ఛదంగా మూసివేసి బంద్‌కు మద్దతు పలకాలని కోరారు. అలాగే రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేసేలా తాము కూడా ప్రత్యక్షంగా పాల్గొంటామని లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. బంద్‌ సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేస్తామని లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు తెలిపారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నారు. ఒక వేళ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుండా తమ పోరాటం నిరంతరాయంగా కొనసాగుతుందని హెచ్చరించాయి.




Next Story