అమరావతి: సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మరో పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రైతన్నలకు ఏటా రూ.20,000 అందించే అన్నదాత - సుఖీభవ పథకాన్ని ఈ నెల చివరిలో ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన డబ్బులూ ఈ నెలాఖరులోనే జమ కానుండగా.. అదే రోజు అన్నదాత - సుఖీభవను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం ఇచ్చే రూ.2000తో కలిపి ఏపీ ప్రభుత్వం అదనంగా రూ.5000 జమ చేయనుంది.
పీఎం కిసాన్ యోజన కింద కేంద్రం ఏడాదికి మూడు విడతల్లో రూ.6000 అందిస్తోంది. దీనికి మరో రూ.14,000 కలిపి ఏపీ ప్రభుత్వం రైతులకు అందించనుంది. ఈ పథకంలో భాగంగా 2వ విడతగా అక్టోబర్లో రూ.7000, వచ్చే ఏడాది జనవరిలో రూ.6000 రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. మొదట అన్నదాత సుఖీభవ పథకం నిధులను జూన్ 20న విడుదల చేయాలని భావించారు. అయితే ఈ కార్యక్రమం ఈ నెలాఖరుకు వాయిదా పడినట్లు తెలిసింది. అన్నదాత సుఖీభవ పథకం కింద ఏపీవ్యాప్తంగా మొత్తం 45.71 లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించారు.