తప్పు చేసిన వారికి శిక్ష పడాలనే నినాదంతో ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం వెళ్తోంది..అని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. విజయవాడలో మంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ.. మా ప్రభుత్వంలో సాక్ష్యాలు లేకుండా పోలీసులు ఏ కేసులోనూ ముందుకు వెళ్లడం లేదు. తప్పు చేసిన వారిని పారదర్శకంగానే శిక్షిస్తున్నాం. టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో ఎంత ఆవేశం ఉన్నా.. గత ప్రభుత్వంలో తప్పు చేసిన వారి పట్ల ఓ పద్ధతి ప్రకారం చట్టపరంగానే చర్యలు తీసుకుంటున్నాం..అని మంత్రి పేర్కొన్నారు.
గత ప్రభుత్వంలో పని చేసిన అధికారులే ఎందుకు అరెస్టు అవుతున్నారో వైసీపీ ఆత్మ విమర్శ చేసుకోవాలి. జగన్ కారణంగా గతంలో శ్రీలక్ష్మి లాంటి అధికారులు కూడా జైలుకు వెళ్లారు. గత టీడీపీ హయంలో అక్రమ కేసులతో నాయకులు బలయ్యారు కానీ.. మా కారణంగా అధికారుల అరెస్ట్ జరగలేదు. తెలుగు దేశం ప్రభుత్వం తప్పు చేయలేదు అనడానికి ఇదే నిదర్శనం. జగన్ నాలుగు గోడల మధ్య కాకుండా ప్రజల్లోకి వచ్చి అక్రమ కేసులు లాంటి మాటలు మాట్లాడితే ప్రజలే సరైన సమాధానం చెబుతారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకే డోర్ డెలీవరి హత్య కేసులో పునర్ విచారణ జరుగుతోంది..అని హోంమంత్రి అనిత చెప్పారు.