ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఆ జీవో వెనక్కి

Andhrapradesh govt withdraw go number 59. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో వార్డు, మహిళా కార్యదర్శులను మహిళా పోలీసులుగా నియమిస్తూ జీవో నంబర్‌ 59ను జారీ చేసిన విషయం తెలిసిందే.

By అంజి  Published on  9 Dec 2021 8:59 AM GMT
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఆ జీవో వెనక్కి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో వార్డు, మహిళా కార్యదర్శులను మహిళా పోలీసులుగా నియమిస్తూ జీవో నంబర్‌ 59ను జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ జీవో నంబర్‌ 59ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వ న్యాయవాది.. రాష్ట్ర హైకోర్టుకు తెలిపారు. జీవో నంబర్‌ 59పై దాఖలైన పిటిషన్‌ల విచారణ సందర్భంగా రాష్ట్ర సర్కార్‌ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు దృష్టికి తెచ్చారు. అలాగే డ్రెస్‌ కోడ్‌ సైతం ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ప్రభుత్వం మహిళా పోలీస్‌ సేవలను ఏ విధంగా ఉపయోగించుకోవాలనే విషయంపై కసరత్తు చేస్తోందన్నారు. అయితే దీనిపై పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేస్తామని రాష్ట్ర న్యాయస్థానికి తెలిపారు. కాగా ఈ కేసు తదుపరి విచారణను వారం రోజుల పాటు హైకోర్టు వాయిదా వేసింది.

మహిళలు పోలీస్‌ స్టేషన్లకు వచ్చేందుకు వెనుకంజ వేస్తున్నారని, వారి సమస్యలను స్థానికంగానే పరిష్కరించాలన్న ఉద్దేశంతో జీవో నంబర్‌ 59ను ప్రభుత్వం జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో దాదాపు 15 వేల మంది మహిళా కార్యదర్శులను నియమించి, వారికి అనధికారికంగా కానిస్టేబుల్‌ హోదా కల్పించారు. అయితే తాజాగా హైకోర్టులో జీవో నెంబర్‌ 59పై విచారణ సంద్భంగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆక్షేపించింది. గ్రామ కార్యదర్శులకు కానిస్టేబుళ్లుగా మార్చి వారికి పోలీసు డ్రస్‌ ఇవ్వడంతో పాటు పలు అభ్యంతరాలు తెలపడంతో జోవోను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు.

Next Story