వారికి అదే లాస్ట్ డే..సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మరోసారి వార్నింగ్ ఇచ్చారు
By Knakam Karthik
వారికి అదే లాస్ట్ డే..సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఆడబిడ్డలపై ఇష్టానుసారం పోస్టులు పెడితే వారికి అదే చివరి రోజు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏలూరు జిల్లా వడ్లమాను సభలో సీఎం మాట్లాడుతూ.. సోషల్ మీడియా నేరస్థుల అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చింది. ఎవడైనా సరే వ్యక్తిత్వ హననానికి పాల్పడితే అదే చివరి రోజు అని హెచ్చరిస్తున్నా. మహిళలను గౌరవప్రదంగా బతకనివ్వండి. మీకు చేతనైతే విలువలు నేర్పించండి..అని చంద్రబాబు హితవు పలికారు.
అసెంబ్లీలో బూతులు మాట్లాడేవారు..తనను బూతులు తిట్టారని సీఎం చంద్రబాబు చెప్పారు. అది గౌరవసభ కాదు, కౌరవ సభ అని అప్పుడే చెప్పా.. సీఎంగా అడుగు పెడతానని చెప్పానని.. అలాగే అసెంబ్లీకి వచ్చానని గుర్తుచేశారు. ఆడపిల్లల క్యారెక్టర్ను హననం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. సోషల్ మీడియాలో దారుణంగా వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డిను హత్య చేసి గుండెపోటు అన్నారని.. తప్పులు చేసే వారిని ఉపేక్షించబోమని వార్నింగ్ ఇచ్చారు. అనంతపురం వెళ్లి జగన్ డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ఇంతకుముందు వైసీపీ హయాంలో తనను కూడా రాష్ట్రంలో తిరగనివ్వలేదని చెప్పారు. ఇప్పుడు స్వేచ్ఛగా తిరగనిస్తుంటే, రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు. నేరాలు చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
కాగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్పై టీడీపీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది. పార్టీ నుంచి కిరణ్ను సస్పెండ్ చేసింది. దీంతో చేబ్రోలు కిరణ్పై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు మరోసారి హెచ్చరించారు.