ఆంధ్రప్రదేశ్లోని నేతన్నలకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల హామీని నెరవేరుస్తూ ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్లకు (మరమగ్గాలకు) 500 యూనిట్ల వరకు విద్యుత్ను ఉచితంగా సరఫరా చేయనున్నారు.
దీనివల్ల రాష్ట్రంలోని 1.04 లక్షల చేనేత కుటుంబాలకు నేరుగా లబ్ధి చేకూరడమే కాకుండా, ప్రభుత్వంపై ఏటా రూ.150 కోట్ల అదనపు భారం పడనుంది. ఇప్పటికే నేతన్నల పెన్షన్ను రూ.4 వేలకు పెంచిన ప్రభుత్వం, ఇప్పుడు ఉచిత విద్యుత్ ద్వారా ఒక్కో చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.8,640, పవర్లూమ్ యూనిట్కు రూ.21,600 వరకు ఆర్థిక వెసులుబాటు కల్పించనుంది.
ముడిసరుకుపై సబ్సిడీ, ఆధునిక యంత్రాల కొనుగోలుకు రాయితీలు, అమెజాన్ వంటి ఇ-కామర్స్ సంస్థలతో మార్కెటింగ్ అనుసంధానం వంటి చర్యలతో చేనేత రంగానికి పూర్వవైభవం తెచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. ఈ పథకం అమలుతో ఉత్పత్తి వ్యయం తగ్గి నేతన్నల ఆదాయం గణనీయంగా పెరుగుతుందని ఆశిస్తున్నారు.