నటుడు పోసాని కృష్ణమురళిని ఆదోనీ పోలీసులు పీటీ వారెంట్పై గుంటూరు జైలు నుంచి తరలిస్తుండడం పట్ల వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. మూడు రోజుల్లో మూడు పోలీస్ స్టేషన్లకు తిప్పడం పట్ల విచారం వ్యక్తం చేశారు. 67 ఏళ్ల వయసున్న పోసానిని ఆ జైలుకు, ఈ జైలుకు తిప్పడం వేధించడమేనన్నారు.
పోసానిని రైల్వే కోడూరు నుంచి నరసరావుపేట తీసుకువచ్చారు. నరసరావుపేట నుంచి గుంటూరు సబ్ జైలుకు తరలించారు. మళ్లీ ఇవాళ ఆదోని అంటున్నారు.. అదొక 400 కిలోమీటర్లు ఉంటుంది. 67 ఏళ్ల పోసాని పట్ల ఈ విధంగా వ్యవహరించడం దుర్మార్గం. గత రాత్రే ఆయనను తీసుకువచ్చారు.. ఇప్పుడు మళ్లీ తీసుకెళుతున్నారు. అది కూడా పోలీస్ జీప్ లో తీసుకెళుతున్నారు.. పోలీస్ జీప్ ఎలా ఉంటుందో తెలిసిందే కదా.. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి వేధింపులకు గురిచేసేందుకు ఇలా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు.
పోసానిపై ఒకే అంశం మీద 16 కేసులు పెట్టారని తెలుస్తోంది.. ఈ విషయాన్ని పరిశీలిస్తామన్నారు. పోలీస్ వ్యవస్థ, నారా లోకేశ్ కలిసి ఉద్దేశపూర్వకంగా పాల్పడుతున్న కుట్ర ఇది అని ఆరోపించారు. పోసాని అంతర్జాతీయ కుట్ర చేశాడా? మీడియాలో మాట్లాడినందుకు 16 కేసులు పెట్టారు. ఓ రెండు మూడు నెలలు ఆయనను ఇలా కేసుల పేరిట తిప్పాలన్న దురుద్దేశంతో కుట్రపూరితంగా జరుగుతున్న కార్యక్రమం ఇది. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాకపోతే ఇంకేమిటి? అని ప్రశ్నించారు. వైసీపీకి అనుకూలంగా ఉన్నవాళ్లందరినీ భయపెట్టాలనుకుంటున్నారు.. దీనిపై మేం న్యాయపోరాటం చేస్తామని అంబటి రాంబాబు అన్నారు.